‘విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం.. ఏ ఒక్కరినీ కాపాడడం సాధ్యం కాలేదు’ హోంమంత్రి అమిత్షా
అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన నిమిషాల్లోనే ఎయిరిండియా విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విమానంలోని 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది దుర్మరణం చెందారు. అదే విమానంలో ఉన్న ఒకేఒక్క ప్రయాణికుడు మాత్రం ఇంతపెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా అందరూ అగ్నికి ఆహుతయ్యారు..

అహ్మదాబాద్, జూన్ 13: ఆహ్మదాబాద్లో గురువారం (జూన్ 12) మధ్యాహ్నం 1.38 గంటలకు ఎయిరిండియా విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విమానంలోని 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది దుర్మరణం చెందారు. అదే విమానంలో ఉన్న ఒకేఒక్క ప్రయాణికుడు మాత్రం ఇంతపెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా అందరూ అగ్నికి ఆహుతయ్యారు. అయితే విమానం నేరుగా ఎయిర్పోర్టు పక్కనే ఉన్న మెడికల్ విద్యార్ధుల హాస్టల్పై పడటంతో అందులో 25 మంది మెడికోలు మృత్యువాత పడ్డారు. దీంతో ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 265కి చేరింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన నిమిషాల్లోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన యావత్ భారతాన్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా విలేకరుల సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. ఏమన్నారంటే..
ఎయిర్ ఇండియా విమానం నంబర్ AI-171 దురదృష్టకర సంఘటనతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. కూలిపోయిన విమానంలో దాదాపు 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉంది. ఇంధనం మండుతున్న కారణంగా విమానంలో ఉష్ణోగ్రత అధికంగా ఉంది. అందువల్ల ఎవరినీ రక్షించడం సాధ్యంకాలేదు. ఈ ప్రమాదంలో మరణించిన ప్రయాణీకుల కుటుంబాలకు దేశ ప్రజలందరూ అండగా నిలుస్తున్నారు. భారత ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం, ప్రధానమంత్రి తరపున బాధితులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. భారత ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం కలిసి సహాయ, రక్షణ చర్యలలో నిమగ్నమై ఉన్నాయి. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణీకుడిని ఆసుపత్రిలో కలిశారు. DNA పరీక్ష తర్వాత మాత్రమే అధికారికంగా మృతుల సంఖ్యను ప్రకటిస్తారు. సంఘటన జరిగిన వెంటనే, గుజరాత్ ప్రభుత్వం భారత ప్రభుత్వంలోని ఆరోగ్య శాఖ, అగ్నిమాపక దళం, పోలీసు శాఖ- CAPF విభాగాలతో సహా విపత్తు నిర్వహణ అన్ని విభాగాలను అప్రమత్తం చేసింది. అందరూ కలిసి సహాయ, రక్షణ పనులలో పాల్గొన్నారు. సంఘటన స్థలంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. సంఘటన స్థలానికి చేరుకున్న బంధువుల ప్రయాణీకుల DNA నమూనాలను తీసుకునే ప్రక్రియ కూడా రాబోయే 2-3 గంటల్లో పూర్తవుతుంది. విదేశాల్లో ఉన్న బంధువులకు సమాచారం అందించాం. వారు చేరుకున్న వెంటనే వారి DNA నమూనాలను తీసుకుంటారు.
గుజరాత్ FSL (ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ), NFSU (నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ) సంయుక్తంగా DNA పరీక్షను సాధ్యమైనంత తక్కువ సమయంలో పూర్తి చేస్తాయి. ఆ తర్వాత మృతుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తారు. బంధువుల బస, మానసిక ఓదార్పు, మానసిక గాయానికి గురైన వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని హోం మంత్రి అమిత్షా తెలిపారు.
మరోవైపు విమానయాన శాఖ తన దర్యాప్తును వేగంగా ప్రారంభించింది. విమాన ప్రమాదంపై దర్యాప్తుకు రంగంలోకి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దిగింది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) ప్రొటోకాల్స్ ప్రకారం ప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు వివిధ విభాగాల్లోని నిపుణులతో హై-లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిటీ అధ్యయనం చేయనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.