AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊటీ వెళ్తున్నారా..? ఈ కొత్త రూల్ గురించి తెలుసా..?

ఈ వేసవి సెలవుల్లో చాలా మంది పర్యాటకులు ఊటీ, కొడైకెనాల్ వంటి పర్వత ప్రాంతాల్లో పర్యటించడానికి వెళ్లిపోతున్నారు. కానీ ఈ రెండు ప్రాంతాల్లో ప్రకృతిని కాపాడుకోవడంపై కొన్ని కొత్త మార్పులు వచ్చాయి. ఇటీవల చెన్నై హైకోర్టు ఈ ప్రాంతాల్లో 28 రకాల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించింది.

ఊటీ వెళ్తున్నారా..? ఈ కొత్త రూల్ గురించి తెలుసా..?
Madras Hc Orders Plastic Ban In Hill Stations
Prashanthi V
|

Updated on: Apr 16, 2025 | 9:21 PM

Share

ఈ వేసవి సెలవుల్లో చాలా మంది కుటుంబాలతో కలిసి పర్యటనకు వెళ్లేందుకు ఊటీ, కొడైకెనాల్ వంటి హిల్ స్టేషన్లను ఎంచుకుంటున్నారు. అయితే తాజాగా ఈ రెండు ప్రాంతాల్లో పర్యావరణాన్ని కాపాడే దిశగా ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. చెన్నై హైకోర్టు ఊటీ, కొడైకెనాల్‌లలో 28 రకాల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధిస్తూ కఠిన ఆదేశాలు జారీ చేసింది. పర్యాటకులు తమ వెంట ప్లాస్టిక్ వస్తువులు తీసుకెళ్తే వారి వాహనాలను జప్తు చేయాలని కోర్టు స్పష్టంగా తెలిపింది. ఈ నిర్ణయం పర్యావరణాన్ని రక్షించడంలో ఓ కీలక ముందడుగుగా పరిగణించబడుతోంది.

ప్రస్తుతం ఊటీని పర్వతాల రాణిగా, కొడైకెనాల్‌ను పర్వతాల ప్రిన్సెస్ గా పిలుస్తారు. వేసవిలో ఈ ప్రాంతాల్లో పర్యాటకుల సంఖ్య లక్షల్లో పెరుగుతుంది. అధిక రద్దీ వల్ల అక్కడి ప్రకృతి ధ్వంసమవుతున్న నేపథ్యంలో ప్రజల రాకపోకలపై నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారు. 2025 ఏప్రిల్, మే నెలల్లో కొడైకెనాల్‌కు వెళ్లాలనుకునే ప్రతి పర్యాటకుడు తప్పనిసరిగా ఈ-పాస్ తీసుకోవాల్సిందే. ఇది పర్యాటకుల రద్దీని క్రమబద్ధీకరించి అక్కడి వన్యప్రాణులు, ప్రకృతి సంపదను కాపాడేందుకు తీసుకున్న నిర్ణయం.

పర్యాటకులు వెళ్లే ప్రతి ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనందరిది. అయితే కొంతమంది బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్ లాంటి ప్లాస్టిక్ చెత్తను అక్కడే వదిలిపెడుతున్నారు. ఇది అక్కడి పర్యావరణాన్ని తీవ్రమైన విధంగా దెబ్బతీసుతోంది. ఊటీ, కొడైకెనాల్ వంటి పచ్చని ప్రాంతాల్లో ప్లాస్టిక్ చెత్త పెరగడం వల్ల అక్కడి నేల, నీరు, వాతావరణం కలుషితమవుతోంది. దీనివల్ల వన్యప్రాణులకు కూడా ముప్పు ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని అరికట్టేందుకు కోర్టు కఠిన ఆదేశాలు ఇచ్చింది.

హైకోర్టు 28 రకాల ప్లాస్టిక్ వస్తువులను నిషేధించింది. ఇందులో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు, చెత్త సంచులు వంటి ఎన్నో వస్తువులు ఉన్నాయి. పర్యాటకులు ఈ ప్లాస్టిక్ వస్తువులను తీసుకెళ్తే వారి వాహనాలను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించింది. అంతేకాకుండా పర్యాటకులు ఉపయోగించే వాటర్ బాటిల్స్‌ను సురక్షితంగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక బ్యాగులు అద్దెకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది.

పర్యాటక వాహనాల పరిమితిపై కూడా చర్యలు తీసుకున్నారు. గత మార్చి 14న జిల్లా అధికారులు కొన్ని నిబంధనలు ప్రకటించారు. వాటి ప్రకారం ఊటీలో వారము రోజులలో 6,000 వాహనాలు, వీకెండ్ రోజుల్లో 8,000 వాహనాలు మాత్రమే అనుమతిస్తారు. కొడైకెనాల్‌లో వారాంతాల్లో 6,000 వాహనాలు, సాధారణ రోజుల్లో 4,000 వాహనాలకే అనుమతి ఉంది. అయితే స్థానిక వాహనాలపై ఈ పరిమితులు వర్తించవు. ప్రభుత్వ బస్సులు, రైళ్ల ద్వారా వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఆంక్షలు ఉండవు.

పర్యాటక ప్రాంతాల్లో మనం ఆనందించడమే కాదు.. అక్కడి ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే. ఓ పర్యాటకుడిగా మనం శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తే రాబోయే తరాలు కూడా ఈ అందాలను ఆస్వాదించగలుగుతాయి. మన ఆనందం కోసం ప్రకృతిని హానిచేయకుండా.. సహజ వనరులను జాగ్రత్తగా కాపాడుకుందాం.

Follow Us