గాలి… నీరు… ఆహారం…ఈ మూడే సమస్త జీవరాశికీ ప్రాణాధారం… పరిమాణం విషయంలో ఈ మూడింటి మధ్య వ్యత్యాసం ఉంది. శరీరానికి అన్నిటికంటే ఎక్కువ అవసరం గాలి. గాలి కంటే తక్కువ పరిమాణంలో శరీరానికి కావలసిన రెండవ అవసరం నీరు. గాలీ, నీరు కన్నా తక్కువ పరిమాణంలో శరీరానికి కావలసిన మూడవ అవసరం ఆహారం. ఈ నిష్పత్తిని కాపాడుకోవడం ఆరోగ్యదాయకం.
బరువు పెరగడానికి జన్యుపరమైన వారసత్వ౦, థైరాయిడ్ హార్మోన్ లోపాలు, అవసరానికి మించి తినడం, వ్యాయామ లోపాలు ఇవే ప్రధాన కారణంగా ఉంటాయి. అయితే అత్యధికుల్లో చివరి రెండు కారణాలే ప్రధానంగా కనిపిస్తాయి. అవసరానికి మించి తినేవాళ్లు, సరిపడా శారీరక శ్రమ చేయని వారు సహజంగానే బరువు పెరుగుతారు. ఊబకాయుల్లో నీరు, కొవ్వు ఈ రెండే పెరుగుతుంటాయి. వీటివల్ల మొత్తం శరీర నిష్పత్తులే తారుమారు అవుతాయి.
నీరు, ఆహారం పరిమాణాలు పెరిగే సరికి గాలి తగ్గిపోతుంది. జీవకణాలు జీవక్రియల్ని సవ్యంగా చేయాలంటే, అవసరమైన వాటిని అవసరమైన నిష్పత్తిలో ఇవ్వాలి. ఈ నిష్పత్తిలో తేడా వస్తే, బరువు పెరగడంతో పాటు, శరీరం రోగగ్రస్థమవుతుంది. ఈ స్థితిలో వాటి నిష్పత్తులను నిర్ణీత స్థాయికి అంటే 3:2:1 నిష్పత్తికి తీసుకురావాలి.
బరువు తగ్గడానికి యోగాను ఎంచుకోవచ్చు. బరువు పెరగడం అనేది అందరిలోనూ ఒకేలా ఉండదు. ఒక్కొకరిలో ఒక్కో చోట పెరుగుదల కనిపిస్తుంది. కొందరిలో పొట్ట మాత్రమే పెరిగితే, మరికొందరికి తొడ వెనుక భాగం, నడుము భాగంలో బరువు పెరుగుతుంది. అందువల్ల ఆయా అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ఆసనాలను ఎంచుకోవాలి. కొవ్వు పెరిగిన ప్రదేశాలనుబట్టి సాధన చేయాలి. ఇలా ఆహార నియమాలు, వ్యాయామ౦ పట్ల శ్రద్ద వహిస్తే సులువుగానే బరువు తగ్గడ౦ ఖాయ౦.