Telugu News Lifestyle Godavari style Poornam Boorelu recipe made for Varalakshmi Devi blessings
Purnam Burelu: వరలక్ష్మీ దేవి నివేదనకు పూర్ణం బూరెలు.. అమ్మమ్మ స్టైల్ లో తయారీ విధానం మీ కోసం
పిండి వంటల్లో పూర్ణం బూరెలు ఒకటి. గోదావరి జిల్లా వాసులు పెసర బూరెలు, పచ్చి శనగ పప్పు, ప్రసాదం బూరెలు వంటి రకరకాల బూరెలను తయారు చేస్తారు. అయితే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి దేవికి నైవేద్యం కోసం పచ్చి శనగపప్పుతో పూర్ణం బూరెలను తయారు చేసుకోండి. ఈ రోజు పూర్ణం బూరెల తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
శ్రావణ మాసం వస్తూ వస్తూ శ్రావణ శోభను తీసుకొచ్చింది. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీదేవి వ్రతం చేసుకోవడానికి మహిళలు రెడీ అవుతున్నారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి పూజకు ప్రత్యెక ఏర్పాట్లు చేస్తారు. అంతేకాదు అమ్మవారి పూజలో నైవేద్య నివేదనకు కొన్ని రకాల పిండి వంటలు తయారు చేస్తారు. పిండి వంటల్లో పూర్ణం బూరెలు ఒకటి. గోదావరి జిల్లా వాసులు పెసర బూరెలు, పచ్చి శనగ పప్పు, ప్రసాదం బూరెలు వంటి రకరకాల బూరెలను తయారు చేస్తారు. అయితే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి దేవికి నైవేద్యం కోసం పచ్చి శనగపప్పుతో పూర్ణం బూరెలను తయారు చేసుకోండి. ఈ రోజు పూర్ణం బూరెల తయారీ విధానం గురించి తెలుసుకుందాం.
పూర్ణం బూరెల తయారీకి కావాల్సిన పదార్ధాలు..
మినపగుళ్ళు- అర గ్లాసు
బియ్యం – రెండు గ్లాసులు
సోడా ఉప్పు -చిటికెడు
ఉప్పు – చిటికెడు
నూనె – వేయించడానికి సరిపడా
పూర్ణం తయారీకి
పచ్చి శనగపప్పు- గ్లాసు
బెల్లపు పొడి- గ్లాసు
యాలకుల పొడి – కొంచెం
తయారీకి కావాల్సిన పదార్ధాలు:
ముందు రోజు రాత్రి గిన్నెలో నీరు పోసి మినపగుళ్ళు, బియ్యాన్ని విడివిడిగా నానబెట్టుకోవాలి. మర్నాడు నీరు తీసి మినపపప్పు, బియ్యం వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి.
పూర్ణం రెడీ చేయడానికి గ్యాస్ స్టవ్ మీద కుక్కర్ పెట్టి పచ్చి శనగపప్పు వేసి శుభ్రంగా కడిగి సరిపడా నీరు పోసి శనగ పప్పుని మెత్తగా ఉడికించాలి.
తర్వాత శనగ పప్పులోని నీరు తీసి ఉడికిన శనగపప్పు మెత్తగాన మిక్సీ వేసుకోవాలి. స్టవ్ మీద దళసరి గిన్నె పెట్టుకోవాలి.
ఆ గిన్నెలో తరిగిన బెల్లం కొంచెము నీరు పోసి బాగా గరిటతో తిప్పుతూ వేడి చేయాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మిక్సి వేసుకున్న శనగపప్పుని వేసి అడుగు అంటకుండా కదుపుతూ .. బెల్లం శనగపప్పు మిశ్రమం బాగా గట్టిగా అయ్యేవరకూ గరిటతో తిప్పుతూ ఉండండి.
పూర్ణం గట్టిపడిన తర్వాత ఉండ అవుతుందో లేదో చూసి ఉండ అవుతుంటే స్టవ్ మీద నుంచి దింపెయ్యాలి. ఇప్పుడు అందులో యాలకుల పొడిని వేసి బాగా కదపాలి.
ఇప్పుడు బూరెలకు అవసరమైన తోపు పిండిని వేరే గిన్నెలోకి తీసుకుని అవసరమైన నీళ్ళు, సోడా ఉప్పు, ఉప్పు వేసి పూర్ణం బూరెల కోసం తోపుని రెడీ చేసుకోవాలి.
ఇప్పుడు పూర్ణాన్ని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుని పక్కకు పెట్టుకోవాలి.
ఇలా శనగ పప్పు పూర్ణం బూరెల కోసం తోపు, పూర్ణం ఉండలు రెడీ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి బాగా కాగనివ్వాలి. ఆ వేడి నూనెలో రెడీ చేసుకున్న పూర్ణం ఉండాలని తీసుకుని తోపులో ముంచి జాగ్రత్తగా నూనెలో వేసుకోవాలి.
గరిటతో బూరెలు అటు ఇటు తిప్పుతూ ఎర్రగా దోరగా వేయించుకోవాలి. అంతే అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి పూర్ణం బూరెలు రెడీ..
పూర్ణం బూరెలు అమ్మ వారికి నివేదించిన అనంతరం.. వాటికీ చిన్న కన్నం పెట్టుకుని దానిలో నెయ్యి వేసుకుని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే ఎవరైనా..