Ragi Pindi Recipes: రాగులను పిల్లలు కూడా ఇష్టంగా తినాలా.. రాగి పిండితో కుడుములు చేసి పెట్టండి.. లొట్టలేసుకుని మరీ తినేస్తారు..
ఆరోగ్యంపై ప్రస్తుతం ప్రజలకు శ్రద్ధ పెరిగింది. దీంతో రాగులతో చేసే రకరకాల ఆహార పదార్ధాలను తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అయతే పిల్లలు కూడా రాగులతో చేసిన ఆహారం ఇష్టంగా తినాలంటే రాగి పిండి కుడుములను తయారు చేసి ఇవ్వండి. రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. ఈ రోజు రాగి పిండి కుడుముల తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
చిరు దాన్యాల్లో ఒకటి రాగులు. వీటిని ఫింగర్ మిల్లెట్స్ అని కూడా అంటారు. వాస్తవానికి ధాన్యాలన్నిటిలోకి రాగులు మంచి ఆరోగ్యకరమైన పోషకాహారం. ముఖ్యంగా రాగుల్లో ఉండే అధిక పోషక విలువలు, ఫైబర్ కంటెంట్ వలన పిల్లలకు మంచి ఆహారంగా భావిస్తారు, అంతేకాదు రాగులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి.
కావాల్సిన పదార్ధాలు :
- రాగి పిండి – 1 కప్పు
- అటుకులు పొడి – అర కప్పు
- వేయించిన వేరుశెనగలపొడి – అర కప్పు
- పచ్చికొబ్బరి తురుము – 1 కప్పు
- బెల్లం – 1 కప్పు
- నెయ్యి – కావల్సినంత
- యాలకుల పొడి – 1 టీస్పూన్
- నీళ్ళు – పావు కప్పు
- ఉప్పు- కొంచెం
ముందుగాస్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో పావు కిలో బెల్లం పొడిని వేసుకుని పావు కప్పు నీరు వేసి బాగా కరిగేలా బబుల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. తర్వాత ఆ బెల్లం నీరుని ఒక పక్కకు పెట్టి.. ఇప్పుడు ఒక బాణలి పెట్టుకుని అందులో ఒక కప్పు రాగి పిండి వేసుకుని మంట తక్కువగా పెట్టి వేయించాలి. తర్వాత అటుకుల పిండిని వేసి వేయించి తర్వాత వేయించి పొడి చేసిన వేరుశనగ పప్పు పొడిని, పచ్చి కొబ్బరి తురుముని వేసి వేయించుకోవాలి. పిండి వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బెల్లం నీరుని వేసి బాగా ఉండలు లేకుండా రాగి మిశ్రమాన్ని కలపాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి, యాలకుల పొడి,కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి. ఇపుడు ఈ రాగి పిండి మిశ్రమాన్ని ఉండలుగా కుడుములుగా చుట్టుకోవాలి. తర్వాత వీటిని ఆవిరి మీద ఉడికించండి. అంతే రుచికరమైన ఆరోగ్యకరమైన రాగి పిండి కుడుములు రెడీ. వీటిని పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. గాలి తగలని సీసాలో పెట్టుకుంటే మూడు రోజులు నిల్వ ఉంటాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..