‘నా నోరు నొక్కలేరు’.. విపక్ష లేబర్ పార్టీ ఎంపీలపై ప్రీతి పటేల్ ఫైర్
బ్రిటన్ లోని మైనారిటీలు ఎదుర్కొంటున్న జాతి వివక్షను వారి మానసిక బలహీనతగా చూపడానికి హోమ్ మంత్రి ప్రీతి పటేల్ తన భారతీయ వారసత్వాన్ని వినియోగించుకుంటున్నారని ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీలు చేసిన ఆరోపణను..
బ్రిటన్ లోని మైనారిటీలు ఎదుర్కొంటున్న జాతి వివక్షను వారి మానసిక బలహీనతగా చూపడానికి హోమ్ మంత్రి ప్రీతి పటేల్ తన భారతీయ వారసత్వాన్ని వినియోగించుకుంటున్నారని ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీలు చేసిన ఆరోపణను ఆమె ఖండించారు. భారతీయ సంతతికి చెందిన ఈమె ఇటీవల హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రసంగిస్తూ.. ఈ దేశంలో తాను మైనారిటీగా ఉన్నప్పుడు తనకు వ్యక్తిగతంగా కలిగిన అనుభవాలను ప్రస్తావించారు. అయితే భారతీయ సంతతికే చెందిన లేబర్ పార్టీ ఎంపీలు వీరేంద్ర శర్మ, తాన్ ధేసి, ప్రీత్ గౌర్ గిల్, వలేరీ వాజ్, సీమా మల్హోత్రా తదితరులు ఆమెకు లేఖ రాస్తూ.. ఒక మనిషి రంగును బట్టి అన్ని రకాల జాత్యహంకార ధోరణులను తప్పు పడుతున్నారని, ఇందుకు మీ భారతీయ వారసత్వాన్ని వినియోగించుకుంటున్నారని విమర్శించారు. అసలు బ్రిటన్ అంతటా నల్ల జాతీయులు ఎదుర్కొంటున్న రేసిజం మీకు కనబడలేదని వారు పేర్కొన్నారు. కాగా.. అమెరికాలో నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా యుఎస్ లోనే కాక, బ్రిటన్ లో కూడా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రేగాయి. ఆందోళనకారులు…. నాటి స్లేవ్ ట్రేడర్ల విగ్రహాలను కూల్చివేస్తుండగా.. ప్రీతి పటేల్ వారి నిరసనను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. దీనిపైనే విపక్ష లేబర్ పార్టీ ఎంపీలు ఆమెను దుయ్యబట్టారు.