17 నుంచి పట్టాలెక్కనున్న తేజస్ ఎక్స్‌ప్రెస్… రేపటి నుంచి బుకింగ్ స్టార్ట్!

భారత్ దేశంలో తొలి ప్రైవేట్ రైలు తేజస్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రైవేట్ రైళ్లు పూర్తిస్థాయిలో పట్టాలు ఎక్కనున్నాయి.

17 నుంచి పట్టాలెక్కనున్న తేజస్ ఎక్స్‌ప్రెస్... రేపటి నుంచి బుకింగ్ స్టార్ట్!
Follow us

|

Updated on: Oct 07, 2020 | 7:11 PM

భారత్ దేశంలో తొలి ప్రైవేట్ రైలు తేజస్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రైవేట్ రైళ్లు పూర్తిస్థాయిలో పట్టాలు ఎక్కనున్నాయి. దేశంలో కార్పొరేట్ సెక్టార్‌కు చెందిన తొలి రైలు తేజస్ ఎక్స్ ప్రెస్ ఈ నెల 17 నుంచి పరుగులు పెట్టనుంది. ఐఆర్సీటీసీ ఈ వీఐపీ రైలుకు సంబంధించిన రిజర్వేషన్ బుకింగ్‌ను ఈనెల 8 వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు భారత రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులకు రైలులో ప్యాక్డ్ ఫుడ్ కూడా అందించనున్నారు. ఐఆర్సీటీసీ, రైల్వేబోర్టు అధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సుమారు ఏడాది క్రితం లక్నో- న్యూఢిల్లీ మధ్య కార్పొరేట్ సెక్టార్‌కు చెందిన తొలి రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌ పరుగులు పెట్టించిన రైల్వే అధికారులు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఫ్లాన్ చేశారు. కాగా, అహ్మదాబాద్-ముంబై మధ్య కూడా ఇదే తరహా రైలును ప్రారంభించారు. ఆధునిక సదుపాయాలు కలిగిన ఈ రైళ్లు ప్రయాణికుల ఆదరణకు నోచుకున్నాయి. ఈ రైళ్ల రాకలో జాప్యం జరిగితే ప్రయాణికులకు వారి టిక్కెట్ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. ఎయిర్‌లైన్స్‌లో ఉన్నట్టు డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఉంది. అంటే రైలు ఛార్జీలు స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటాయి. కన్సెషన్ టికెట్స్ తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు వర్తించవు. తత్కాల్ కోటా, ప్రీమియం తత్కాల్ కోటా కూడా ఉండవు. 5 ఏళ్లలోపు పిల్లలకు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.

తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రైవేట్ రైలు అయిన తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో అత్యాధునిక సదుపాయాలతో ప్రయాణికులకు లగ్జరీ ప్రయాణ అనుభవం లభిస్తుంది. తేజస్ రైలులో అత్యాధునికమైన సేవలు, టీ, కాఫీ, స్నాక్స్, భోజనం, ఇతర ప్రీమియం సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కళ్లు చెదిరే ఇంటీరియర్, రీడింగ్ లైట్స్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్, సీసీటీవీ కెమెరాలు, బయో టాయిలెట్స్, ఎల్ఈడీ టీవీ, ఆటోమెటిక్ డోర్స్ లాంటి సదుపాయాలను కల్పించారు. తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించేవారికి ఉచితంగా రూ.25 లక్షల ప్రమాద బీమాతో పాటు ఇంట్లోని వస్తువులకు కూడా రూ.1 లక్ష బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ. ప్రయాణికులకు పికప్ సర్వీస్‌తో పాటు రైలు గంట ఆలస్యంగా వస్తే క్యాష్ బ్యాక్, నామినల్ క్యాన్సలేషన్ ఛార్జెస్ లాంటి సేవలను అందిస్తుంది.