అలాంటి వారి కోసం హైదరాబాద్‌ నుంచి వచ్చారు: బాబు, లోకేష్‌పై రోజా ఫైర్‌

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి వంద శాతం పథకాలను అమలు చేశారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.

అలాంటి వారి కోసం హైదరాబాద్‌ నుంచి వచ్చారు: బాబు, లోకేష్‌పై రోజా ఫైర్‌
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2020 | 2:34 PM

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి వంద శాతం పథకాలను అమలు చేశారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆదివారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న రోజా.. అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా పరీక్షల నిర్వహణలో అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ ముందు ఉందని తెలిపారు. కరోనా చికిత్సను  ప్రభుత్వం ‘ఆరోగ్యశ్రీ’ కిందకి తీసుకొచ్చిందని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా చికిత్సకి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని.. కానీ జగన్‌ ఎంతో మంది ప్రాణాలను కాపాడారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, నారా లోకేష్‌పై ఆమె విమర్శలు గుప్పించారు.

ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్, 151 సీట్లు గెలిచిన‌ జగన్‌పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని  రోజా అన్నారు. పని పాట లేని లోకేష్ పబ్జీ ఆడుకొంటున్నాడని.. ముందు లోకేష్ రాజకీయాలపై అవగాహన తెచ్చుకోవాలని రోజా హితవు పలికారు. రాష్ట్ర ఖజానాకి చంద్రబాబు 3.5లక్షల కోట్లు అప్పు ఉంచి వెళ్లారని, ఆర్థిక ఇబ్బందుల్లోనూ జగన్ ప్రజలను ఆదుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పరిస్థితులను బట్టి ఆయన ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.

13 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి, మేము బతికుంటే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారని రోజా మండిపడ్డారు. టీడీపీలో ఉన్న అవినీతిపరులు సాక్ష్యాలతో సహా దొరికి అరెస్ట్‌ అయితే వారి కోసం హైదరాబాద్‌ నుంచి వచ్చారని బాబు, లోకేష్‌ను ఆమె దుయ్యారబట్టారు. బాబుకి అధికారం, అవినీతి డబ్బు కావాలే తప్ప, ప్రజలపై అభిమానం లేదని, ఆయన నైజం ఏమిటో ప్రజలందరికి తెలిసిందని విమర్శించారు.