అంతరిక్ష రంగంలో భారత్ సత్తా చాటిందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. జాతినుద్దేశించి మాట్లాడిన ఆయన అంతరిక్ష రంగంలో మనం 4వ స్థానంలో ఉన్నామని, అమెరికా, చైనా, రష్యా సరసన చేరామని చెప్పారు. మిషన్ శక్తి అనేది అత్యంత కఠినమైన ఆపరేషన్ అని.. శక్తిసామర్థ్యాల్లో భారత్ అగ్రదేశాల సరసన చేరిందని కొనియాడారు . యుద్ధ వాతావరణం సృష్టించడం భారత్ ఉద్దేశం కాదన్న మోడీ డీఆర్డీఓ శాస్త్రవేత్తలను అభినందించారు.
‘అంతర్జాతీయ నిబంధనలను, చట్టాలను ఉల్లంఘించలేదు. కేవలం మన దేశ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించుకోవడం కోసం చేసింది మాత్రమే ఈ ప్రయోగం. అంతరిక్షంలో శాటిలైట్ను పడగొట్టడం అనేది అత్యంత అరుదైన విజయం. ఈ విజయంతో భారత్ అంతరిక్ష పరిశోధనా, ప్రయోగాల్లో అతిపెద్ద నాలుగో దేశంగా అవతరించింది. అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన నిలిచింది. ఈ రోజు వ్యవసాయం, విపత్తు నిర్వహణ, కమ్యూనికేషన్, వాతావరణం, నావిగేషన్ ఎన్నో రంగాల్లో మనకు సరిపడా శాటిలైట్లు ఉన్నాయి. దేశ భద్రత, ఆర్థిక వృద్ధి, సాంకేతిక ఆధునికీకరణ కోసం మిషన్ శక్తి కీలక ముందడుగు లాంటిది’ అని మోదీ తెలిపారు.