వ్యాక్సిన్ వచ్చేదాకా అలసత్వం వద్దు.. దేశప్రజలకు మోదీ పిలుపు
దేశ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. కరోనా ప్రభావం ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు ప్రజలు కరోనా నిబంధనలను నిర్లక్ష్యం చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలను పాటించకపోతే ఏమవుతుందో గుర్తు చేస్తూ వార్నింగిచ్చారు పీఎం.
కరోనాతో సహజీవనం చేస్తున్నామంటూ నిబంధనల పాలనలో అలసత్వం వద్దని హెచ్చరించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దసరా వంటి పెద్ద పండుగలొచ్చాయని కదా అని మాస్కులను పక్కన పెట్టేయడం, రెండు గజాల దూరాన్ని పాటించకపోవడం, సబ్బుతో తరచూ చేతులను కడుక్కోకపోవడం వంటివి చేస్తే కరోనా మళ్ళీ విజృంభించే ప్రమాదం వుందని మోదీ వార్నింగ్ ఇచ్చారు. యూరప్ దేశాలలో కరోనా కంట్రోలైందన్న నమ్మకంతో యధేచ్ఛగా ప్రవర్తించారని, ఆయా దేశాలిపుడు రెండో దశ కరోనా విజృంభణతో వణికిపోతున్నాయని ప్రధాన మంత్రి గుర్తు చేశారు.
గత కొన్ని రోజులుగా ప్రజల్లో కనిపిస్తున్న నిర్లక్ష్యంపై ప్రధాన మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన జాతినుద్దేశించే ప్రసంగించారు. కరోనాపై అలసత్వం వద్దని దేశప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా పూర్తిగా అంతమయ్యే దాకా అలసత్వం వద్దని ఆయన చెప్పారు. కరోనా నిబంధనలను పాటించకపోతే తమ ప్రాణాలతోపాటు తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేస్తున్నామన్న సంగతి విస్మరించవద్దని మోదీ హెచ్చరించారు.
కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనుకొనేందుకు ప్రపంచ దేశాలు పని చేస్తున్నాయని, భారత్ కూడా వ్యాక్సిన్ రూపకల్పనలో చక్కని ఫలితాలు సాధిస్తోందని మోదీ అన్నారు. దేశంలో పలు లాబోరేటరీలు వ్యాక్సిన్పై ప్రయోగాలు చేస్తున్నాయని, అవి విజయవంతం కాగానే దేశంలో ప్రతీ పౌరునికి కరోనా వ్యాక్సిన్ అందించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోందని ప్రధాన మంత్రి వివరించారు. వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్పై అధికారయంత్రాంగా కార్యాచరణ రూపొందిస్తోందని మోదీ చెప్పారు.
అయితే ఎప్పటి దాకా వ్యాక్సిన్ రాదో అప్పటి దాకా నిర్లక్ష్యం వద్దని, ఏ మతస్థులైనా వారికి తమ పండుగలెప్పుడు ప్రత్యేకమైనవే కానీ ప్రస్తుతం చాలా క్లిష్టమైన దశ నడుస్తోందన్న సంగతి విస్మరించవద్దని ప్రధాన మంత్రి సూచించారు. పండుగలొచ్చాయంటూ కరోనా నిబంధనలను విస్మరించవద్దన్నారు. దసరా అయినా, దీపావళి అయినా, ఈద్ అయినా, క్రిస్మస్ అయినా.. ఛత్ పూజలైనా కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమిస్తూ ముందుకు వెళితేనే జీవన సాఫల్యం కలుగుతుందన్న ప్రధాన మంత్రి.. మాస్క్ ధరించడం, రెండు గజాల దూరం పాటించడం, తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యమని తెలిపారు. ఈ నిబంధనల అవసరాన్ని దేశప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు, ప్రతీ ఒక్కరిలో అవగాహన పెంచేందుకు మీడియా, సోషల్ మీడియా ప్రయత్నించాలని మోదీ కోరారు.
Also read: Breaking News యాంటీ బాడీస్ తగ్గితే మళ్ళీ కరోనా
Also read: ఏపీ స్కూళ్ళలో కోవిడ్ ఆంక్షలివే.. స్వయంగా చెప్పిన సీఎం
Also read: వరద సాయంపై జగన్ కీలక ఆదేశాలు
Also read: వరద బాధితులకు మైహోం గ్రూపు రూ.5 కోట్ల విరాళం