Nalgonda Congress: నల్గొండ కాంగ్రెస్లో కార్చిచ్చు.. హైకమాండ్కు తలనొప్పిగా మారిన కేబినెట్ కూర్పు!
కాంగ్రెస్ పార్టీకి, నల్గొండ జిల్లాకు అవినాభావ సంబంధం ఉంది. అందుకు తగ్గట్టే.. ఈ జిల్లా నుంచి ఉద్ధండ నాయకులు పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుంటారు. అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో.. పెద్ద తలకాయలుగా చలామణి అవుతుంటారు. జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, రాంరెడ్డి దామోదర్రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే బడా లీడర్ల పేర్లకు ఇక్కడ కొదవుండదు. అదంతా ఒకెత్తయితే.. జిల్లాలో ఈ హేమాహేమీల మద్య అస్సలు పొసగకకపోవడం ఒకెత్తు. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ఇక్కడి నాయకులతో ఇదో తలనొప్పి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర గడిచాక.. ఇప్పుడు నల్గొండ కాంగ్రెస్ నేతలు మరోసారి అసలు ఆట మొదలెట్టినట్టు కనిపిస్తోంది.

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనే కాదు..రాష్ట్ర రాజకీయవర్గాల్లోనూ పెద్ద దుమారమే రేపుతున్నాయి. తనకు మంత్రిపదవి రాకుండా జానారెడ్డి అడ్డుపడుతున్నారంటూ కార్యకర్తల సమావేశంలోనే రాజగోపాల్ ఆరోపణలు గుప్పించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ధర్మరాజులా ఉండాల్సిన వ్యక్తి దృతరాష్ట్ర్రుడిలా వ్యవహరిస్తున్నారని..అన్నదమ్ములిద్దరూ మంత్రివర్గంలో ఉంటే తప్పేంటని ప్రశ్నించిన రాజగోపాల్.. జానారెడ్డి 25 ఏళ్లపాటు మంత్రిపదవిలో కొనసాగలేదా? అని నిలదీశారు.
కరెక్ట్గా మంత్రివర్గ విస్తరణపై విస్తృత ప్రచారం జరుగుతున్న వేళ.. ఆశావహుల్లో అందరికన్నా ముందున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి..ఈస్థాయిలో జానారెడ్డిని టార్గెట్ చేయడం వెనక పెద్ద కారణమే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల హైకమాండ్కు లెటర్ రాసిన జానారెడ్డి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలని..అలా చేస్తే పార్టీకి, ప్రజలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే సొంత జిల్లా నల్గొండకు మూడో మంత్రిపదవిపై జోరుగా చర్చ జరుగుతున్నప్పటికీ..ఆవిషయాన్ని తన లేఖలో ప్రస్తావించలేదు జానారెడ్డి. దీంతో తనకు పదవి రాకుండా అడ్డుకునేందుకు లేఖలో నల్గొండ ప్రస్తావన తీసుకురాలేదనే రాజగోపాల్రెడ్డి భావిస్తున్నారట.
అప్పట్లో బీజేపీ నుంచి వెనక్కి వచ్చిన రాజగోపాల్రెడ్డి..మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలో చేరిక సమయంలోనే ఆయనకు మంత్రిపదవిపై హైకమాండ్ మాట ఇచ్చిందట. దీంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అయితే, అన్న వెంకట్ రెడ్డి ఇప్పటికే కేబినెట్ మంత్రిగా ఉండడంతో రాజగోపాల్ రెడ్డికి పదవి ఇచ్చేందుకు హైకమాండ్ ఆలోచిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి జానారెడ్డిని కలవడం. మంత్రివర్గ విస్తరణపై జానారెడ్డి నేరుగాహైకమాండ్కు సూచనలు చేస్తూ లేఖ రాయడం.. చకచకా జరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా బరస్టయిపోయారు రాజగోపాల్రెడ్డి. తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉన్నా.. కొందరు దుర్మార్గులు అడ్డుకుంటున్నారంటూ…పరోక్షంగా జానారెడ్డిని టార్గెట్ చేశారు. అయితే, సీనియర్నేతను దృతరాష్ట్రుడితో పోల్చడం సరికాదంటూ.. జానారెడ్డి శిష్యులు ఖండిస్తున్నారు. రాజగోపాల్రెడ్డి మంత్రిపదవికి అనర్హుడంటూ ఎవరూ చెప్పలేదనీ… జిల్లాకు రాజగోపాల్రెడ్డి రూపంలో మూడో మంత్రి పదవి వస్తే సంతోషిస్తామనీ చెప్పారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్.
అయితే, జానారెడ్డికి, కోమటిరెడ్డి బ్రదర్స్కి మధ్య విభేదాలు ఈనాటివేం కాదు. గతంలోనూ వీరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా జానారెడ్డికి కేబినెట్లో బెర్త్ కన్ఫామ్ అయ్యుండేది. అదే రేంజ్లో తమ హవా కూడా ఉండాలని తమపట్టు పెంచుకుంటూ వచ్చారు. జానారెడ్డికి చెక్ పెట్టేందుకు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతీనియోజకవర్గంలో తమకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతకు ముందుకు నల్గొండ కాంగ్రెస్ అంటే జానారెడ్డి అన్నట్టుగా ఉన్న పరిస్థితిని మార్చేయడంలో కోమటిరెడ్డి బద్రర్స్ సక్సెస్సయ్యారు. అలా ముదిరిన, జానారెడ్డి, కోమటిరెడ్డిల వైరం.. దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఒకరికి ఒకరు సహకరించుకోకుండా.. ఎవరిదారి వారిదే అన్నట్టుగా ముందుకు సాగుతున్న ఈ కీలక నేతలు.. మరోసారి తమ విభేదాల్ని ఇలా రోడ్డున పడేసుకున్నారు.
మొత్తానికి జానారెడ్డి లేఖతో, మరోసారి రగులుకున్న నల్గొండ కాంగ్రెస్.. ఎప్పుడు చల్లారుతుందన్నదే అర్థం కావడం లేదు. అటు హైకమాండ్, మంత్రి పదవి విషయంలో జానారెడ్డి సూచనను ఫాలో అవుతుందా? లేక కోమటిరెడ్డి వార్నింగ్కు భయపడుతుందా? అన్నది కూడా ఆసక్తి రేపుతోంది. ఈ రెండింట్లో ఏది జరిగినా.. అగ్గి మరింత రాజుకోవడం మాత్రం కామన్. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మంత్రిపదవి ఇస్తే జానారెడ్డి వర్గం ఊరుకోదు. పదవి ఇవ్వకపోతే కోమటిరెడ్డి ఊరుకోరు. మరి, ఈ పదవి పంచాయితీని కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…