Nagarjuna sagar by election : సాగర్లో ప్రలోభాల పర్వం, పోలింగ్కు సమయం దగ్గరపడుతోన్న వేళ రూల్స్ బ్రేక్ చేస్తున్న నేతలు
Nagarjuna sagar by election : ఓవైపు నేతల ప్రచారం. మరోవైపు ప్రధాన పార్టీల ప్రలోభాల పర్వం. పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది...
Nagarjuna sagar by election : ఓవైపు నేతల ప్రచారం. మరోవైపు ప్రధాన పార్టీల ప్రలోభాల పర్వం. పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ప్రచారానికి మరికొన్ని గంటలే మిగిలి ఉంది. దీంతో నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలైన TRS, BJP, కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రచార ఘట్టం చివరి దశకు చేరుకుంటుడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సిట్టింగ్ స్థానం కోసం కారు గుర్తు నేతలు సుడిగాలి ప్రచారం చేస్తుంటే …బీజేపీ సైతం స్టార్ క్యాంపెయిన్తో కేంద్ర పెద్దల్ని రంగంలోకి దింపింది. కాంగ్రెస్ నేతలు కూడా ఎక్కడా తగ్గడం లేదు.
ప్రచారంలో అన్నీ పార్టీలు దూసుకెళ్తున్నప్పటికి పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని, విపక్షాలపైనే కేసులు పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల వాహనాల్నే తనిఖీలు చేస్తున్నారంటున్నారు. అయితే నియోజకవర్గంలో ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించిన అధికార, ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేశారు. ఇందుకోసం జిల్లా పోలీసు యంత్రాంగం ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించింది. ఏడు కేసుల్లో 46,79,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 45 ప్రాంతాల్లో మద్యం కేసులను నమోదు చేసి 35 లక్షల విలువైన మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. 45 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు ప్రధాన పార్టీలకు చెందిన వారిని బైండోవర్ చేశారు.
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. నెంబర్ ప్లేట్ లేకుండా ఎలాంటి వాహనాలు రోడ్లపై తిరిగే వాహనాలను గుర్తించి కేసులు బుక్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి కాన్వాయ్ లో ఎక్కువ వాహనాలు ఉన్న వాటిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రంగనాథ్ చెబుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి కాన్వాయ్ లకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 88 కేసులు నమోదు చేశారు.