కోవిద్ 19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ పై యుద్ధభేరీ మోగించేందుకు 30వేలకు పైగా విశ్రాంత ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది, సైనిక వైద్య సేవకులు, ప్రైవేటు వైద్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ప్రభుత్వం తెలిపింది. కరోనాపై పోరాడేందుకు స్వచ్ఛందంగా పేర్లు నమోదు చేసుకోవాలని మార్చి 25న ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు 30,100 వైద్య సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
కాగా.. ఇందులో విశ్రాంతి ప్రభుత్వ వైద్యులు, సైనిక వైద్య సేవకులు, ప్రైవేటు వైద్యులు ఉన్నారు అని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. వైద్యశాఖ ప్రకారం ప్రస్తుతం దేశంలో కొవిడ్-19 కేసులు 2,301కి చేరుకున్నాయి. 56 మంది మృతిచెందారు. చైనాలో వెలుగుచూసి ప్రపంచమంతా సంక్రమించిన నావెల్ కరోనా వైరస్పై పోరాడేందుకు స్వచ్ఛందంగా పేర్లు నమోదు చేసుకోవాలని నీతిఆయోగ్ వెబ్సైట్లో మార్చి 25న ప్రభుత్వం ప్రకటన వెలువరించింది. కరోనా కట్టడికి అమెరికా, ఇటలీ, బ్రిటన్, వియత్నాం సహా అనేక దేశాల్లో విశ్రాంత వైద్యులు, వైద్య సిబ్బంది ముందుకు రావాలని పిలుపునిచ్చాయి.