అన్నదాత సమస్యలను కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలి.. రైతుల ఆందోళనకు మద్దుతు ప్రకటించిన కమల్హాసన్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్ ప్రకటించారు. మాజీ ఐఏఎస్ సంతోష్ బాబు పార్టీలో చేరిక సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్ ప్రకటించారు. మాజీ ఐఏఎస్ సంతోష్ బాబు పార్టీలో చేరిక సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నటుడు రజినీకాంత్ తన ఆప్తమిత్రుడని , అవసమైతే ఆయన ఇంటికి వెళ్లి మద్దతు కోరుతానని అన్నారు కమల్. ఎంఎన్ఎం ప్రధాన కార్యదర్శిగా సంతోష్ బాబును నియమించారు.
సంతోష్ బాబు డాక్టర్ అని, ఐఏఎస్ అధికారిగా 25 ఏళ్ల పాటు ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సేవలందించేందుకు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారని వెల్లడించారు. ఎనిమిది సంవత్సరాలు ముందుగానే ఆయన పదవిని వీడారని అభినందించారు.
రాబోయే రోజుల్లో మరింత మంది మంచి వ్యక్తులను పార్టీలోకి సంతోష్ బాబు తీసుకు వస్తారని అన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయ నిర్వహణ బాధ్యతల ఆయనకు అప్పగించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టో రూపకల్పన బాధ్యతలు కూడా సంతోష్ బాబు చూసుకుంటారని అన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. రైతు సమస్యలేమిటో కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలని కమల్హాసన్ సూచించారు.