Madanapalle Incident: మూఢత్వంలో మునిగారు.. కన్నబిడ్డలనే కడతేర్చారు.. వారి వెనుక అదృశ్య శక్తులు..?

మదనపల్లె స్థానిక శివనగర్‌లో పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు గత కొంతకాలంగా నివాసముంటున్నారు.పురుషోత్తం నాయుడు మహిళా డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌గా,

Madanapalle Incident: మూఢత్వంలో మునిగారు.. కన్నబిడ్డలనే కడతేర్చారు.. వారి వెనుక అదృశ్య శక్తులు..?
Follow us

|

Updated on: Jan 25, 2021 | 2:34 PM

Madanapalle Daughters Murder Incident Case: వారి జ్ఞానం మూఢాంధకారంలో మునిగిపోయింది. వారు ఉన్నతంగా చదువుకున్నారు.. కానీ మూఢ విశ్వాసానికి బానిసయ్యారు.. భక్తి ముసుగులో నవమాసాలు మోసిన కన్న కూతుళ్లనే దారుణంగా కడతేర్చారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అయితే ఈ జంట హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

వివరాలు..

మదనపల్లె స్థానిక శివనగర్‌లో పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు గత కొంతకాలంగా నివాసముంటున్నారు. పురుషోత్తం నాయుడు మహిళా డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌గా, ఆయన భార్య పద్మజ ఓ ప్రైవేట్‌ విద్యాసంస్థ కరస్పాండెంట్‌, ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. అలేఖ్య(27), సాయిదివ్య(23). పెద్దకుమార్తె అలేఖ్య మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తూ, ఇటీవలే రాజీనామా చేసింది. ప్రస్తుతం ఆమె సివిల్స్‌కు సిద్ధమవుతుండగా.. రెండో కుమార్తె సాయిదివ్య ఎంబీఏ పూర్తిచేసి చెన్నైలోని ఏఆర్‌ ఇనిస్టిట్యూట్‌లో మ్యూజిక్‌ ప్రాక్టీస్ చేస్తోంది. వాస్తవానికి మెహర్ బాబా, ఓషో భక్తులైన పురుషోత్తం నాయుడు, భార్య పద్మజ తమ కుమార్తెలను కూడా భక్తులుగా మార్చారు. ఈ క్రమంలోనే పురుషోత్తం నాయుడు ప్రవర్తనలో మార్పు వచ్చింది. తాను వారం రోజులపాటు దీక్షలో ఉంటానని, తనకు ఎవరు ఫోన్ చేయొద్దంటూ కొలీగ్స్‌తో చెప్పాడు. దాదాపు పది రోజుల నుంచి ఇంట్లో పూజలు జరుగుతున్నాయని, గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఇంటికి వచ్చి వెళ్తున్నారని స్థానికులు పోలీసులతో పేర్కొన్నారు.

మూఢ విశ్వాసాలలో మునిగిన దంపతులిద్దరూ ఆదివారం కూతుళ్లతో కలిసి నగ్నంగా పూజలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో తల్లి పద్మజ.. భర్త ఎదుట పూజగదిలో చిన్న కుమార్తె సాయి దివ్యను శూలంతో పొడిచి, పెద్దకుమార్తె అలేఖ్యను డంబెల్‌తో నుదిటిపై మోది చంపింది. ఆ తరువాత తండ్రి పురుషోత్తం.. కళాశాలలో పనిచేస్తున్న తన మిత్రుడికి ఫోన్‌చేసి జరిగిన విషయమంతా చెప్పాడు. దీంతో ఈ ఘోరం బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ క్రమంలో తమ ఇంట్లో దివ్య శక్తులు ఉన్నాయని.. తమ పిల్లలు మళ్లీ బతికి వస్తారంటూ మూఢత్వంలో మునిగిన తల్లిదండ్రులు పోలీసులతో చెప్పారు.

అయితే చంపే ముందే.. ఇద్దరు బిడ్డలను ఇంటిచుట్టూ ప్రదిక్షిణలు చేయించినట్లు స్థానికులు చెబుతున్నారు. పెద్దకుమార్తెను చంపే క్రమంలో రెండో కుమార్తె తనను రక్షించాలంటూ బయటకు వచ్చి అరిచినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పదిరోజులుగా రాత్రంతా ఇంట్లో కేకలు వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ జంట హత్యల కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు మల్లూరు పురుషోత్తం నాయుడు, పద్మజ కూతుళ్లు అలేఖ్య, సాయిదివ్య ఇన్‌స్టాలో చేసిన పోస్టులు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ‘‘వర్క్ ఈజ్ డన్.. శివ ఈజ్ కమింగ్’’ అంటూ వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్టులు మూడు రోజుల క్రితం చేశారు.

ఈ ఘటన వెనుక ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందని, వారు తరుచూ పురుషోత్తం నాయుడు ఇంటికొచ్చి పూజలు చేసేవారని స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీనిప్రకారం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. క్లూస్ టీంను కూడా రంగంలోకి దింపారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. నిందితులను ఇంట్లోనే ఉంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.