ఐపీఎల్లో క్వారంటైన్ కలకలం ః బీసీసీఐపై గుర్రుగా ఉన్న కొన్ని ఫ్రాంచైజీలు
రూల్సంటే రూల్సే మరి! ఒకరికో రకంగా మరొకరికి మరో రకంగా ఉండకూడదు.. అలా ఉంటేనే గొడవలొస్తాయి.. ఇప్పుడు ఐపీఎల్ టోర్నమెంట్లో ఇదే జరుగుతోంది....
రూల్సంటే రూల్సే మరి! ఒకరికో రకంగా మరొకరికి మరో రకంగా ఉండకూడదు.. అలా ఉంటేనే గొడవలొస్తాయి.. ఇప్పుడు ఐపీఎల్ టోర్నమెంట్లో ఇదే జరుగుతోంది.. కొన్ని ఫ్రాంచైజీలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుపై పీకల్దాకా కోపంతో ఉన్నాయి.. కారణం కొన్ని జట్లను బీసీసీఐ తెగ ముద్దు చేస్తున్నదట! విదేశాల నుంచి నేరుగా ఎమిరేట్స్కు వచ్చే ఆటగాళ్లు నిబంధనల ప్రకారం 36 గంటలపాటు క్వారంటైన్లో ఉండాలి కదా! కానీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మాత్రం క్వారంటైన్ గడువు ముగియకుండానే ఇద్దరు ఆటగాళ్లు చేరారట! దీనిపై రచ్చ అవుతోంది.. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముంబాయి ఇండియన్స్ టీమ్తో అబుదాబి క్రికెట్ స్టేడియంలో తలపడింది.. ముంబాయి జట్టు అబుదాబిలోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం.. కాని ఈ మ్యాచ్ కోసం ధోనీ టీమ్ దుబాయ్ నుంచి బస్లో రెండు గంటలు ప్రయాణించి అబుదాబికి వచ్చింది.. అదే బస్సులో సామ్ కరణ్, జోస్ హేజిల్వుడ్లు కూడా ఉన్నారట! మిగతా ఆటగాళ్లతో కలిసి వారు ప్రయాణించడం మిగతా టీమ్ ప్లేయర్లకు గుబులు పుట్టిస్తోంది. కారణం ఆ ఇద్దరు ఆటగాళ్లకు క్వారంటైన్ పూర్తి కాకపోవడమే! ఈ మధ్యనే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సిరీస్ జరిగింది.. ఆ సిరీస్లో రెండు జట్లకు చెందిన 21 మంది ఆటగాళ్లు ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. వారి కోసం ఏడు ఫ్రాంచైజీలు కోటి రూపాయలు ఖర్చు పెట్టి మరి ఓ విమానంలో దుబాయ్కి తీసుకొచ్చాయి.. అలా వచ్చినవారు 36 గంటలపాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని బీసీసీఐ చెప్పంది.. మిగతా జట్లలో ఉన్న ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం క్వారంటైన్ నిబంధనను పాటిస్తూ రూమ్లకే పరిమితమయ్యారు.. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్లోని ఆ ఇద్దరు ఆటగాళ్లు మాత్రం గడువు ముగియకముందే తమ టీమ్ మెంబర్స్తో కలిశారట. అబుదాబి కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు వారి క్వారంటైన్ ముగుస్తుంది. కానీ వారు నాలుగు గంటలు ముందుగానే రిపోర్టు చేశారు. అంటే వారు 36 గంటల క్వారంటైన్లో లేనట్టే కదా! ఇదే కొన్ని ఫ్రాంచైజీలకు కోపం తెప్పిస్తున్నది. రెండు గంటల్లో ఏదైనా జరగవచ్చు కదా అని అంటున్నాయి..వారి వల్ల ఇతరులకు కరోనా సోకితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.