దేశంలో పెరుగుతున్న కరోనా రికవరీ రేట్
గత కొద్దిరోజులుగా లక్షకు చేరువగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుమొఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 9,33,185 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో మొత్తంగా 75,083 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
గత కొద్దిరోజులుగా లక్షకు చేరువగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుమొఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 9,33,185 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో మొత్తంగా 75,083 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గడిచిన మూడు వారాల్లో 76వేల కంటే తక్కువ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో మంగళవారం నాటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 55,62,663కు చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 44లక్షల 97వేల మంది కోలుకోగా, మరో 9లక్షల 75వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో లక్షకు పైగా కరోనా బాధితులు ఆరోగ్యంగా కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. అయితే, మరణాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. సోమవారం దేశవ్యాప్తంగా మరో 1,053 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనా సోకి మృతిచెందిన వారిసంఖ్య 88,935కు చేరుకుంది.
దేశంలో గత మూడు రోజులుగా నిత్యం నమోదవుతున్న కేసులు, రికవరీలు బాగానే ఉంటున్నాయి.. కరోనా నుంచి కోలుకుంటున్న వారిసంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత మూడు రోజులుగా నిత్యం 90వేలకుపైగా బాధితులు కోలుకొని డిశ్చార్జి అవుతున్నారు. అయితే నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 1,01,468 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్ బయటపడిన తర్వాత ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో కోలుకోవడం ఇదే మొదటిసారి. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 9 లక్షలకు పడిపోయింది. తాజాగా కోలుకున్న వారిసంఖ్యతో పోల్చితే రికవరీ రేటు 80శాతం దాటింది. కాగా, మరో 18శాతం వివిధ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్నారు. మరోవైపు మరణాల రేటు 1.6శాతంగా ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా వైరస్ నుంచి కోలుకుంటున్న వారిలో భారత్లోనే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే స్పష్టంచేసింది.