AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మసీదుల్లో ఖురాన్ రాస్తున్న హిందూ వ్యక్తి.. 40 ఏళ్లుగా మత సామరస్యానికి ప్రతీకగా అనిల్

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అనిల్ కుమార్ చౌహాన్, హిందువు అయినప్పటికీ 40 ఏళ్లుగా మసీదుల్లో ఖురాన్ ఆయత్‌లను అందమైన కాలిగ్రఫీలో రాస్తూ గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీకగా నిలుస్తున్నారు. ఆయన మత సామరస్యం, మానవత్వమే మతం అనే సందేశాన్ని ప్రచారం చేస్తూ నాత్ సభల్లోనూ పాల్గొంటారు. అనిల్ కళ, అంకితభావం పాతబస్తీలోని ప్రేమ, గౌరవానికి అద్దం పడుతోంది.

మసీదుల్లో ఖురాన్ రాస్తున్న హిందూ వ్యక్తి.. 40 ఏళ్లుగా మత సామరస్యానికి ప్రతీకగా అనిల్
Anil Kumar Chauhan Hindu Is
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Sep 17, 2026 | 6:05 PM

Share

హైదరాబాద్ పాతబస్తీకి గంగా-జమునా తెహజీబ్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మతాలు వేరైనా.. మనసులు ఒక్కటిగా కలిసి జీవించే సంస్కృతికి పాతబస్తీ ఎన్నో ఏళ్లుగా నిలయంగా ఉంది. ఇదే సోదరభావానికి మరో ఉదాహరణగా నిలుస్తున్నారు అనిల్ కుమార్ చౌహాన్. హిందూ కుటుంబానికి చెందిన అనిల్.. గత 40 ఏళ్లుగా మసీదుల్లో ఖురాన్ ఆయత్‌లను అందమైన కాలిగ్రఫీ రూపంలో రాస్తున్నారు. అంతేకాదు.. ప్రవక్త హజ్రత్ మహమ్మద్‌పై భక్తితో నిర్వహించే నాత్ సభల్లో నాతియా కలామ్ కూడా చదువుతున్నారు.

ఉర్దూ నేర్చుకోవాలన్న కోరికతో..

సుమారు 40 ఏళ్ల క్రితం అనిల్ కుమార్ చౌహాన్ పాతబస్తీలో షాపుల బోర్డులు, సైన్ బోర్డులు రాసేవారు. అప్పట్లో పాతబస్తీలోని చాలా షాపుల బోర్డులపై ఉర్దూలో పేర్లు రాయడం సాధారణంగా ఉండేది. షాపు యజమానులు తమ షాపుల పేర్లను కాగితంపై ఉర్దూలో రాసి ఇచ్చేవారు. వాటిని చూసి అనిల్ కూడా ఉర్దూ అక్షరాలను రాయడం మొదలుపెట్టారు. అలా క్రమంగా ప్రాక్టీస్ చేస్తూ ఉర్దూ రాయడం నేర్చుకున్నారు. ఉర్దూపై ఆసక్తి పెరగడంతో కాలిగ్రఫీపై కూడా పట్టు సాధించారు.

షాపుల బోర్డుల నుంచి మసీదుల వరకు..

ఉర్దూ రాతపై పట్టు సాధించిన తర్వాత అనిల్ కుమార్ చౌహాన్‌కు మసీదుల్లో కాలిగ్రఫీ చేసే అవకాశం వచ్చింది. మసీదుల్లోని గోడలపై ఖురాన్ ఆయత్‌లను అందంగా రాయడం ప్రారంభించారు. ఆయన రాసిన కాలిగ్రఫీని చూసి పలువురు అభినందించారు. అయితే తాను హిందువు కావడంతో మసీదుల్లో ఖురాన్ ఆయత్‌లు ఎలా రాస్తున్నారని కొందరు ప్రశ్నించారు. ఈ విషయంలో స్పష్టత కోసం అనిల్ కుమార్ చౌహాన్ జామియా నిజామియాను సంప్రదించారు.

జామియా నిజామియా అనుమతితో..

మసీదుల్లో ఖురాన్ ఆయత్‌లు రాయడానికి పాటించాల్సిన పవిత్రత, ఇతర నియమాల గురించి జామియా నిజామియా పెద్దలను అనిల్ అడిగి తెలుసుకున్నారు. పవిత్రతను పాటిస్తూ, సూచించిన నియమాలను అనుసరిస్తూ ఈ పని చేయవచ్చని అక్కడి నుంచి అనుమతి లభించిందని ఆయన తెలిపారు. అప్పటి నుంచి జామియా నిజామియా సూచించిన నియమాలను పాటిస్తూ మసీదుల్లో కాలిగ్రఫీ చేస్తున్నానని అనిల్ చెబుతున్నారు. ఇలా నాలుగు దశాబ్దాలుగా తనకు ఇష్టమైన కళను కొనసాగిస్తున్నారు.

నాత్ సభల్లోనూ నాతియా కలామ్..

అనిల్ కుమార్ చౌహాన్ ప్రత్యేకత కేవలం ఖురాన్ కాలిగ్రఫీకి మాత్రమే పరిమితం కాలేదు. ప్రవక్త హజ్రత్ మహమ్మద్‌పై భక్తితో నిర్వహించే నాత్ సభల్లో కూడా ఆయన పాల్గొంటున్నారు. నాతియా కలామ్ చదువుతూ తన భక్తిని చాటుకుంటున్నారు. హిందూ వ్యక్తిగా ఉండి ముస్లిం మతానికి సంబంధించిన కళ, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడం గురించి అడిగితే.. తనకు మతాల మధ్య ప్రేమ, గౌరవమే ముఖ్యమని అనిల్ చెబుతున్నారు.

గంగా-జమునా తెహజీబ్‌కు పాతబస్తీ ప్రతీక..

హైదరాబాద్‌కు గంగా-జమునా తెహజీబ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని అనిల్ కుమార్ చౌహాన్ అంటున్నారు. పాతబస్తీలో హిందూ, ముస్లింలు ఎన్నో ఏళ్లుగా సోదరభావంతో కలిసి జీవిస్తున్నారని తెలిపారు. తాను కూడా ఈ వాతావరణంలోనే పెరిగానని, ముస్లిం సోదరులతో కలిసి పనిచేస్తూ ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. తన కళకు ముస్లిం సమాజం నుంచి లభించిన ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేనని అనిల్ పేర్కొన్నారు.

మతం కంటే మానవత్వమే ముఖ్యం..

మతాలు వేరైనా మనుషుల మధ్య ప్రేమ, గౌరవం ఉండాలని అనిల్ కుమార్ చౌహాన్ ఆకాంక్షిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న మత సామరస్య వాతావరణం ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నారు. తన చేతిరాత ఒక మతానికి మాత్రమే చెందినది కాదని.. కళకు మతం ఉండదని ఆయన చెబుతున్నారు. 40 ఏళ్లుగా ఉర్దూ కాలిగ్రఫీ, మసీదుల్లో ఖురాన్ ఆయత్‌ల రాత ద్వారా తనకు వచ్చిన గుర్తింపును ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.

హైదరాబాద్‌లో హిందూ, ముస్లింలు ఇలాగే ప్రేమాభిమానాలతో కలిసి ఉండాలని.. నగరానికి ఉన్న గంగా-జమునా తెహజీబ్ మరింత బలపడాలని అనిల్ కుమార్ చౌహాన్ ఆకాంక్షించారు.మతం వేరు కావచ్చు.. కానీ మనసులు కలిస్తే మానవత్వం ఒక్కటేనని తన 40 ఏళ్ల ప్రయాణంతో అనిల్ కుమార్ చౌహాన్ చెబుతున్నారు.

Follow Us