Hyderabad became crucial in IPL tourney: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీ చివరి దశకు వచ్చేసరికి ఆసక్తికరంగా మారింది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో వుండి.. మరో మ్యాచ్ మిగిలే వున్న ముంబై టాప్ వన్గా ప్లేఆఫ్ దశకు చేరుకోగా.. మిగిలిన మూడు స్థానాల విషయంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి కేవలం 12 పాయింట్లతోనే కనిపిస్తున్న హైదరాబాద్ సన్ రైజర్స్ తమ చివరి మ్యాచ్లో బంపర్ విక్టరీ కొడితే సీన్ మొత్తం మారే సంకేతాలు కనిపిస్తున్నాయి.
మొదటి స్థానంతో ముంబై ప్లే ఆఫ్ దశకు చేరుకోగా.. రెండో స్థానంలో వున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, మూడో స్థానంలో వున్న ఢిల్లీ కేపిటల్స్ సోమవారం జరిగే మ్యాచ్తో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఎవరు గెలిచినా రెండో స్థానం ఖరారవుతుంది. కానీ ఓడిన జట్టు ఇక తదుపరి మూడు, నాలుగో స్థానం కోసం మంగళవారం ముంబై, హైదరాబాద్ మ్యాచ్ ఫలితం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఇక వరుస విజయాలతో దూసుకొచ్చి, ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో దుమ్ము రేపిన కోల్కతా నైట్రైడర్స్ కూడా ముంబై, హైదరాబాద్ జట్ల చివరి మ్యాచ్ ఫలితం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఒకవేళ ముంబై జట్టు గెలిస్తే.. మరో ఛాన్స్ లేకుండా హైదరాబాద్ సన్ రైజర్స్ ఇంటి బాట పట్టాల్సిందే. మూడు, నాలుగు స్థానాలను ఢిల్లీ, కోల్కతా జట్లు పొందుతాయి. నెట్ రన్ రేటులో కాస్త మెరుగ్గా వున్న ఢిల్లీ జట్టు మూడో స్థానంతోను, కోల్కతా జట్టు నాలుగో స్థానంతోను ప్లే ఆఫ్ మ్యాచ్లకు రెడీ కావాల్సి వుంటుంది.
కానీ, ఒకవేళ ముంబై విజయ పరంపరకు సన్ రైజర్స్ బ్రేక్ వేస్తే.. మూడు, నాలుగు స్థానాలకు అనూహ్యంగా హైదరాబాద్ దూసుకువెళ్ళే ఛాన్స్ వుంది. సన్ రైజర్స్ నెట్ రన్ రేట్ కాస్త మెరుగ్గా వుండడమే ఇందుకు కారణం. ముంబైపై కాస్త మెరుగ్గా గనక హైదరాబాద్ విజయం సాధిస్తే ఏకంగా అయిదో స్థానం నుంచి మూడో స్థానానికి సన్ రైజర్స్ ఎగబాకే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఐపీఎల్ టోర్నీ ముగింపులో ట్విస్ట్ ఇచ్చే ఛాన్స్ వార్నర్ సేనకు దక్కింది. ఈ అవకాశాన్ని ఏ మేరకు వినియోగించుకుంటుందో వేచి చూడాల్సిందే.
ALSO READ: ఏపీ హైకోర్టు రోస్టర్లో కీలక మార్పులు
ALSO READ: భార్య శవంతో టూవీలర్ జర్నీ.. చివరికి కటకటాల పాలు