మాకివ్వాల్సిన నిధులిచ్చి మాట్లాడండి.. కేంద్రానికి హరీశ్ అల్టిమేటమ్
తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ.2,641 ఐజీఎస్టీ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కరోనా కష్ట కాలంలో ఈ నిధులు రాష్ట్రానికి ఎంతో అవసరమని ఆయన మంగళవారం ఐజీఎస్టీపై...
తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ.2,641 ఐజీఎస్టీ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కరోనా కష్ట కాలంలో ఈ నిధులు రాష్ట్రానికి ఎంతో అవసరమని ఆయన మంగళవారం ఐజీఎస్టీపై జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీలో కుండబద్దలు కొట్టారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ అధ్యక్షతన ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. ఇందులో వీడియో కాన్ఫరెన్సు ద్వారా హరీశ్ రావు పాల్గొని తెలంగాణ రాష్ట్ర వాదనను వినిపించారు.
అక్టోబర్ ఐదో తేదీన జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ముందే ఐజీఎస్టీ చెల్లింపులు చేయాలని సిఫారసు చేయాలని హరీశ్ రావు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కు సారథ్యం వహిస్తున్న సుశీల్ కుమార్ మోదీని కోరారు. ఐజీఎస్టీ సెటిల్ మెంట్పైనే ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి రూ.2,638 కోట్లు ఐజీఎస్టీ చెల్లించాల్సి ఉందని జీఎస్టీ కౌన్సిల్ లెక్కలు వేసింది. అయితే తెలంగాణ రాష్ట్ర అధికారుల లెక్కల ప్రకారం ఇంకో 3 కోట్ల రూపాయలు రావాలని, మొత్తం రూ.2,641 కోట్లు కేంద్రం రాష్ట్రానికి బకాయి వుందని హరీశ్ రావు వివరించారు.
‘‘రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఐజీఎస్టీ మొత్తంలో మూడు కోట్లు తగ్గింది. దీనిపై రాష్ట్ర అధికారులు చర్చిస్తారు. ఈ లెక్కలపై ఎలాంటి సమస్య లేదు. కానీ ఐజీఎస్టీ మొత్తం రాష్ట్రాలకు చెల్లించేలా.. వారం రోజుల్లో సిఫారసు చేయాలి’’ అంటూ ఐజీఎస్టీ గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ కన్వీనర్ సుశీల్ కుమార్ మోడీని కోరారు మంత్రి హరీశ్ రావు. కోవిడ్ సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు ఈ నిధులు వస్తే చాలా ఊరట కలుగుతుందన్నారు.