కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు: దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ బంగారం దర్యాప్తు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతుండగా.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Kerala Gold Scam : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ బంగారం దర్యాప్తు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతుండగా.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ఐఏ రిపోర్ట్ ప్రకారం… ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ బ్యాంకు లాకర్ల నుంచి దాదాపు రూ. కోటి నగదు, కేజీ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. కాగా శుక్రవారం స్వప్న సురేష్, సందీప్ ల కష్టడీ ముగిసింది. విచారణలో తాను అక్రమంగా సంపాదించిన నగదు వివిధ బ్యాంకుల లాకర్లలో దాచినట్టు, మరికొన్ని డిపాజిట్ల రూపంలో ఇన్వెస్ట్ చేసినట్టు స్వప్న అంగీకరించింది. ఈ క్రమంలో రూ. 36.5 లక్షలు స్వప్న సురేష్ షెడ్యూల్డ్ బ్యాంక్ బ్రాంచ్ లాకర్ల నుంచి, మరో జాతీయ బ్యాంకు సేఫ్ డిపాజిట్ లాకర్లో ఉంచిన రూ .64 లక్షలు, 982.5 గ్రాముల బంగారు ఆభరణాలను జూలై 23 న స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది.
ఇద్దరు నిందితులను బెయిల్పై విడుదల చేస్తే, వారు పారిపోతారని, కేసులో సాక్ష్యాలను కూడా దెబ్బతీస్తారని ఎన్ఐఏ కోర్టుకు నివేదించింది. స్వాధీనం చేసుకున్న డిజిటల్ సాక్ష్యాలను విశ్లేషించవలసి ఉందని, ఈ కేసులో అంతర్జాతీయ సాక్ష్యాధారాలకు సంబంధించి నిందితుల విచారణ చాలా ముఖ్యమైనది అని ఎన్ఐఏ పేర్కొంది. డిజిటల్ పరికరాల్లోని విషయాలను పరిశోధించడానికి వారి తదుపరి కస్టడీ అవసరమని వెల్లడించింది. ఎన్ఐఏ అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆగస్టు 21 వరకు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్కు పంపింది. ఈ క్రమంలో స్వప్న సురేష్ వేసిన బెయిల్ పిటిషన్ను జూలై 29 వరకు కోర్టు వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి : విశాఖ : పెళ్లికి అతిథులు రాలేదు..కానీ మూడు పూటలా విందు భోజనాలు