Andhra News: రాష్ట్రంలోని విద్యార్థినులకు శుభవార్త.. ఉచితంగా వాటి పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం!
ఆరోగ్యకరమైన సమాజంలో బాలికలు పెరిగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్రంలోని 7 వ తరగతి నుంచి 12 తరగతుల బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ కొనసాగుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. బకాయిలు తీర్చి, ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్యాడ్ల సంఖ్యను సర్దుబాటు చేశామని తెలిపారు. పర్యావరణ అనుకూల ప్యాడ్లు, వెండింగ్ మిషన్లు, HPV వ్యాక్సిన్పై అవగాహన కల్పించే ప్రణాళికలను కూడా వివరించారు. ఈ చర్యలు బాలికల ఆరోగ్య భద్రతకు దోహదపడతాయని ఆన్నారు.

రాష్ట్రంలో 7వ తరగతి నుంచి 12వ తరగతి బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ లను పంపిణీ చేయడం జరుగుతోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలోని విద్యార్థులకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ లను అందించడంపై శాసనమండలిలో సభ్యులు కావలి గ్రీష్మ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇస్తూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో 7వ తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ లను సరఫరా చేయడం జరుగుతోందన్నారు. గతంలో ఏడు రెగ్యులర్ సైజ్, మూడు లార్జ్ సైజ్ న్యాప్ కిన్ లు ఇచ్చేవారని.. ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత 5 రెగ్యులర్ సైజ్, 5 లార్జ్ సైజ్ శానిటరీ ప్యాడ్ ను ప్రభుత్వం అందజేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో 18.96 కోట్ల బకాయిలు పెట్టారని మంత్రి తెలిపారు.
ప్రజా ప్రభుత్వం ఆ బకాయిలను తీర్చడం జరిగిందని.. ఆర్టీజీఎస్ నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ కాల్స్ చేసి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతోందన్నారు. 96శాతం బాలిలకు తమకు శానిటరీ న్యాప్ కిన్ లు అందుతున్నాయని, 4 శాతం మంది అందడం లేదని చెప్పడం జరిగిందన్నారు. నాణ్యత విషయంలో 1 శాతం బాగాలేదని, 14శాతం పర్వాలేదు, బాగుందని 85శాతం మంది చెప్పారన్నారు. శానిటరీ న్యాప్ కిన్స్ ఎబ్సార్ ప్షన్ పై 84శాతం మంది బాగుందని, 14 శాతం మంది పర్వాలేదని, బాగాలేదని 2శాతం మంది ఫీడ్ బ్యాక్ ఇచ్చారన్నారు. సైజ్ విషయంలో 89శాతం మంది బాగుందని, 11శాతం బాగాలేదని చెప్పారు.
ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ పంపిణీపైనా చర్చించడం జరిగిందని.. దీనిపైనా పరిశీలన చేస్తామన్నారు. ఎన్జీవోలతో మాట్లాడి బాలికల్లో అవగాహన పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటామని.. వెండింగ్ మిషన్స్ విత్ స్మార్ట్ కార్డ్ ను ఇప్పటికే కేజీబీవీల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టామన్నారు. అన్ని పాఠశాలలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
అంతముందు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మాట్లాడుతూ.. విద్యార్థినులకు నెలసరి వచ్చే సమయంలో సరైన హైజీన్ ప్రొడక్ట్స్ అందక పాఠశాలలకు గైర్హాజరవుతున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో చదవుతున్న బాలికలకు ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ కచ్చితంగా అందించాలని ప్రభుత్వాన్నికోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
