జీహెచ్ఎంసీ ఎన్నికలుః అన్ని పార్టీల్లో కొత్త టెన్షన్.. సైక్లింగ్‌ బ్యాలెట్‌ ఓటుపై ఆందోళన.. అలాంటి వాటికి అస్కారం లేదంటున్న అధికారులు

|

Nov 23, 2020 | 9:16 PM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్ని రాజకీయపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అయితే, అన్నిపార్టీల్లోనూ కొత్త ఆందోళన..

జీహెచ్ఎంసీ ఎన్నికలుః అన్ని పార్టీల్లో కొత్త టెన్షన్.. సైక్లింగ్‌ బ్యాలెట్‌ ఓటుపై ఆందోళన.. అలాంటి వాటికి అస్కారం లేదంటున్న అధికారులు
Follow us on

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్ని రాజకీయపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అయితే, అన్నిపార్టీల్లోనూ కొత్త ఆందోళన మొదలైంది. ఈసారి బ్యాటెల్ పద్దతిలో ఎన్నికలు జరుగుతుండటం కలవరానికి గురిచేస్తుంది.

గ్రేటర్‌లో చివరి సారిగా 2002లో బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరిగాయి. తరువాతి ఎన్నికల్లో ఈవీఎంలనే ఉపయోగించి పోలింగ్ నిర్వహించారు. సుదీర్ఘ విరామం అనంతరం నగర ఓటర్లు మళ్లీ బ్యాలెట్‌ పెట్టెలు చూడబోతున్నారు. బ్యాలెట్‌ పేపరులో నచ్చిన అభ్యర్థికి రబ్బరు స్టాంపు ముద్ర వేసే అవకాశం రానుంది. 18 సంవత్సరాల తర్వాత డిసెంబరు ఒకటిన జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వినియోగించబోతున్నారు. ఈ నేపథ్యంలో సైక్లింగ్‌ బ్యాలెట్‌ విధానం ఆందోళనకు గురిచేస్తోంది. భద్రతా లోపాలుంటే ఆ విధానంతో ఫలితాన్ని ఏకపక్షం చేసే వీలుండటమే ఇందుకు కారణమని పలు పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయంపై ఇటీవల ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు కూడా చేశారు. పాత విధానంలోని బ్యాలెట్ పద్దతికి స్వస్తి పలికి కొత్త ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిపించాలని కోరారు.

గతంలో ఎన్నికల నిర్వహణ అధికారులకు పెద్ద సవాల్ గా మారేది. పలు చోట్ల ఎన్నికల నిర్వహణలో భద్రత వైఫల్యాలు ఎక్కువ. ఇదే అదనుగా ఏదేనీ పార్టీకి చెందిన కార్యకర్తలు పోలింగ్‌ కేంద్రానికి వచ్చే ఓటర్లను మభ్యపెట్టి బ్యాలెట్ పేపర్ ను తెప్పిస్తారు. ఇలా వచ్చేవారిలో మొదటి వ్యక్తికి ముఖ్య కార్యకర్త పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లకు ఇచ్చే బ్యాలెట్‌ పేపరును పోలిన డమ్మీ పత్రాన్ని మడత పెట్టి ఇస్తారు. దానిపై రబ్బరు స్టాంపుతో అప్పటికే తమ అభ్యర్థికి ఓటు వేసి ఉంటుంది. ఓటరు చేత ఆ చిట్టీని గుట్టుగా తీసుకెళ్లి బ్యాలెట్‌ పెట్టెలో వేసేలా చేస్తారు. పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల అధికారి ఆ ఓటరుకు ఇచ్చే బ్యాలెట్‌ పేపరును జేబులో లేదా లోదుస్తుల్లో దాచుకుని బయటకు తీసుకొచ్చేవారు. ఇలా బయటికొచ్చాక లోపలి నుంచి తీసుకొచ్చిన బ్యాలెట్‌ పేపరును పార్టీ కార్యకర్తకు ఇచ్చి ఓటుకు నోటు తీసుకునే వ్యవహారం అప్పట్లో జోరుగా నడిచేదని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.

అలా వచ్చిన బ్యాలెట్‌ పేపరులో కార్యకర్తలు తమ అభ్యర్థి పేరుపై ముద్ర వేసి మరో ఓటరుకు ఇచ్చి పంపించేవారు. దాన్ని ఆ ఓటరు డబ్బాలో వేసి, అతనికిచ్చిన బ్యాలెట్‌ పత్రాన్ని మళ్లీ బయటకు తీసుకురావడం, దానిపై ముద్ర వేసి మరో ఓటరుతో పంపించడం జరిగేది. లోపలి నుంచి బ్యాలెట్ పేపర్ తెచ్చిన వ్యక్తికి డబ్బులు ముట్టజెప్పడం అప్పట్లో జోరుగా సాగింది. ఈ విధానానికి సైక్లింగ్‌ బ్యాలెట్‌ ఓటుగా పేరొచ్చింది. ఇలాంటి అక్రమ వ్యవహారాలకు అడ్డుకట్ట వేసేందుకే ఎన్నికల సంఘం ఈవీఎంలను తీసుకొచ్చిందని ఉన్నతాధికారులు తెలిపారు. బ్యాలెట్‌ పెట్టెలను ఎత్తుకెళ్లడం, బ్యాలెట్ బాక్సుల్లో ఇంక్ పోయడం వంటి దుర్ఘటనలూ గతంలో చాలానే జరిగేవి. ఇలాంటి వాటికి కట్టడి చేసేందుకు ఈవీఎంలు ప్రవేశపెట్టింది ప్రభుత్వం.

అయితే, తాజాగా మరోసారి బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావడంతో రాజకీయపార్టీల్లో కొత్త టెన్షన్ మొదలైంది. బ్యాలెట్ విధానం వల్ల పాత అక్రమ పద్దతులే అవలంబించే అవకాశముందంటున్నారు. ఎన్నికల అధికారులు మాత్రం అలాంటి అక్రమాలకు ఏమాత్రం తావులేకుండా నిఘా నీడలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి ప్రతి ఓటింగ్ విధానంపై వెబ్ కాస్టింగ్ ఉంటుందంటున్నారు. మరోవైపు రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా ప్రత్యేక పోలీసు బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.