ఓటర్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి..!

|

Sep 29, 2020 | 3:53 PM

కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఓటర్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి..!
Follow us on

నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికకు అక్టోబరు 9న పోలింగ్‌ నిర్వహిస్తుండగా, 12న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. అయితే, ఓటర్లందరూ కచ్చితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన ఓటర్లు బ్యాలెట్‌ లేదా పోలింగ్‌కు చివరి గంటలో ఓటు వేయడానికి అవకాశం ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

అలాగే, పోలింగ్ అధికారులతో పాటు ఓటర్లు కూడా మాస్కులు ఉంటేనే ఓటింగ్‌కు అనుమతిస్తామని, పోలింగ్ కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, క్యాంపులు నిర్వహించే పార్టీలపై చర్యలు తీసుకుంటారు. ఈ ఎన్నికకు సంబంధించి గత ఏప్రిల్‌ 7వ తేదీనే పోలింగ్‌ జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అక్టోబర్‌ 9న పోలింగ్‌, 12న ఓట్ల లెక్కింపు జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 14న ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని పేర్కొంది. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌కు చెందినవారే ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక లాంఛనమే కానుంది. ఈ స్థానం నుంచి 2016లో టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.