గుంటూరులో కరోనా టెర్రర్..గత 10 రోజుల్లో 1811 కేసులు
గుంటూరు జిల్లాను కరోనా కమ్మేస్తుంది. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వైరస్ కట్టడికి అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వ్యాప్తి ఆగడం లేదు.
గుంటూరు జిల్లాను కరోనా కమ్మేస్తుంది. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వైరస్ కట్టడికి అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వ్యాప్తి ఆగడం లేదు. ప్రజలకు కూడా జాగ్రత్తలు పాటించడం లేదు.. కంటెయిన్మెంట్జోన్లలో కూడా జనసంచారం గట్టిగా జరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 208 కేసులు నమోదయ్యాయని మెడికల్ ఆఫిసర్ జె.యాస్మిన్ తెలిపారు. అన్లాక్ సడలింపుల తర్వాత కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఇప్పటికే జిల్లాలో 3 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో మాదిరే ఉక్కుపాదం మోపాలని అధికార యంత్రాంగం యోచిస్తోంది. శుక్రవారం గుంటూరు నగరంలోనే 115 కరోనా కేసులు రాగా ముఖ్య పట్టణాలైన తెనాలిలో 19, నరసరావుపేట 14, తాడేపల్లి 13, పిడుగురాళ్ల 11, వినుకొండలో 7 కేసులు చొప్పున వచ్చాయి. ఇప్పటివరకు వచ్చిన 3వేలకు పైగా పాజిటివ్ కేసుల్లో జిల్లాకు చెందిన వారు 2,799 మంది ఉండగా… మిగిలిన వారు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. ఇప్పటి దాకా కరోనా బారిన పడిన వారిలో 1334 మంది కోలుకుని ఇంటికెళ్లారు. 1439 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 26 మంది ప్రాణాలు విడిచారు. .
జిల్లాలో మార్చి, ఏప్రిల్లో కలిపి 287 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మే లో 223 మందికి కరోనా సోకింది. జూన్కు వచ్చే సరికి కరోనా వీరవిహారం చేసింది. ఆ ఒక్క నెలలోనే 1095 పాజిటివ్ కేసులు కలకలం రేపాయి. జులైలో గత పది రోజుల్లోనే 1811 కేసులు రావటం వ్యాధి ఎంత ప్రమాదకరంగా విస్తరిస్తుందో తెలుపుతుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం వైరస్ నియంత్రణకు చర్యలపై ఫోకస్ పెట్టింది.