నిన్న మీటింగ్.. నేడు ఫైటింగ్..!

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ పేరు అంటే తెలియని వారుండరు. అసలు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు కాంగ్రెస్‌లో తిరుగే లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. అన్నా తమ్ముళ్లు ఇద్దరూ కలిసి ప్రచారంలో జోష్ పెంచారు. ఒకరు పార్లమెంట్ మెంబర్‌గా గెలిస్తే.. మరొకరు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాగా, తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్సే అధికారంలోకి రావడం.. పీసీసీ పదవి తన అన్నకు ఇవ్వకపోవడంతో రాష్ట్ర […]

నిన్న మీటింగ్.. నేడు ఫైటింగ్..!
Follow us

| Edited By:

Updated on: Sep 17, 2019 | 9:51 PM

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ పేరు అంటే తెలియని వారుండరు. అసలు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు కాంగ్రెస్‌లో తిరుగే లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. అన్నా తమ్ముళ్లు ఇద్దరూ కలిసి ప్రచారంలో జోష్ పెంచారు. ఒకరు పార్లమెంట్ మెంబర్‌గా గెలిస్తే.. మరొకరు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాగా, తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్సే అధికారంలోకి రావడం.. పీసీసీ పదవి తన అన్నకు ఇవ్వకపోవడంతో రాష్ట్ర నాయకత్వానికి ఎదురుతిరిగాడు. బీజేపీలో చేరుతానని ట్విస్ట్ ఇచ్చాడు. తరువాత మళ్లీ యూటర్న్ తీసుకుని కాంగ్రెస్‌లోనే ఉంటానని తెలిపాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత నుంచి కోమటిరెడ్డి వ్యవహరిస్తున్న తీరు రాజకీయ విశ్లేషకులకే అర్థం కావడం లేదు. మొన్నటి దాకా బీజేపీ వైపు చూసిన కోమటి రెడ్డి తాజాగా మంత్రి హరీష్‌తో భేటీ అయి మరో కొత్త చర్చకు తెరతీశాడు.

అయితే మొన్నటిదాకా టీఆర్ఎస్‌ పేరు చెబితే అగ్గిమీద గుగ్గీలంలా మండిపడిన రాజగోపాల్ రెడ్డి.. తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావును కలవడం రాజకీయ పరిశీలకులకే తలనొప్పి తెచ్చిపెట్టింది. అన్నేమో కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ.. తమ్ముడు మాత్రం అన్ని పార్టీలు తిరుగుతూ రాజకీయాల్లో ట్విస్టులు ఇస్తున్నాడు. ఇంతకీ రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారా..? లేక టీఆర్ఎస్ కండువా కప్పుకుంటారా..? లేదంటే మళ్లీ సొంతగూటిలోనే కొనసాగుతారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న హరీష్‌కు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులను అడిగేందుకే కోమటిరెడ్డి ఆయనను కలిశారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డికి, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులపై పెద్ద దుమారమే రేగింది. సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో.. కాళేశ్వరం ప్రాజెక్టను చూడటానికి జనం తండోపతండాలుగా వస్తున్నారని చెప్పడాన్ని రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. అదేమైనా టూరిజం స్పాటా అని వ్యంగ్యంగా మాట్లాడారు. వేలకోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ మీరు చేసింది ఇదేనా అంటూ మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించి హరీష్ రావు ఘాటుగా సమాధానం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు చూడటానికి ప్రజలు వెళుతుంటే కాంగ్రెస్ నేతలు అది చూసి తట్టుకోలేకపోతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అసలు ప్రజా సమస్యలు, సంక్షేమం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. ప్రజాసమస్యలపై ప్రశ్నలు వేసిన కాంగ్రెస్ సభ్యులకు ప్రభుత్వం ఇచ్చే సమాధానాలు వినే ఓపిక కూడా లేదన్నారు హరీష్ రావు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను ఏళ్ల తరబడి నిర్మించాయి. ప్రాజెక్టులు అంటే ఏళ్ల తరబడి కాదు నెలల్లోనే పూర్తి చేయొచ్చని కేసీఆర్ నిరూపించారని హరీష్ గుర్తుచేశారు.