AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుబ్బాకపై కన్నేసిన కాంగ్రెస్.. రంగంలోకి అగ్రనేతలు..

తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రాష్ట్రంలో అన్ని పార్టీల దృష్టి అంతా దుబ్బాక నియోజకవర్గంపై పడింది

దుబ్బాకపై కన్నేసిన కాంగ్రెస్.. రంగంలోకి అగ్రనేతలు..
Balaraju Goud
|

Updated on: Sep 30, 2020 | 10:22 PM

Share

తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రాష్ట్రంలో అన్ని పార్టీల దృష్టి అంతా దుబ్బాక నియోజకవర్గంపై పడింది. ఇంతకాలం పార్టీలో అంతర్గత విభేదాలను పక్కనబెట్టిన ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు విపక్ష పార్టీ అధినాయకత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. దుబ్బాక ఎమ్మెల్యేల రామలింగారెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమైంది. దీంతో అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాయి.

దుబ్బాక ఉప ఎన్నికపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎలాగైనా ఈ స్థానాన్ని దక్కించేందుకు విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టింది. పార్టీ శ్రేణులను సమన్వయ పరిచేందుకు సమన్వయకర్తను నియమించింది రాష్ట్ర నాయకత్వం. నియోజకవర్గం పరిధిలోని 7 మండలాలకు పార్టీ అనుబంధ, సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ.. స్థానిక నాయకత్వానికి దిశా నిర్దేశం చేస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వమే రంగంలోకి దిగింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ రాష్ట్ర నాయకత్వానికి పలు కీలక సూచనలు చేశారు. నియోజకవర్గంలోని మొత్తం 146 గ్రామాలకు గాను ప్రతి రెండు గ్రామాలకు ఒక రాష్ట్రస్థాయి సీనియర్‌ నాయకుడికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. మొత్తం ఏడు మండలాలుండగా ప్రతి మండలానికి మాజీమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి నేతను ఇన్‌ఛార్జిగా నియమించాలని ఠాగూర్ ఆదేశించారు. వీరందరినీ సమన్వయపరుస్తూ.. పార్టీ ప్రణాళిక సమర్థంగా అమలు పరిచేలా పర్యవేక్షించేందుకు మరో కమిటీని ఏర్పాటు చేయాలని ఠాగూర్‌ భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ వైఫల్యాలే ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న కాంగ్రెస్ అధికార పార్టీకి చెక్ పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అక్టోబరు మొదటి వారంలో అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ప్రచారపర్వం మొదలు పెట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది.