AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీఎస్టీ పరిహారంపై సీఎం కేసీఆర్ సమీక్ష

సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగే ఉన్నత స్థాయి సమీక్షలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే కేరళ, ఛతీస్‌గఢ్‌, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలు కేంద్రం నిర్ణయాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో రాష్ట్రం తీసుకోనున్న నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

జీఎస్టీ పరిహారంపై సీఎం కేసీఆర్ సమీక్ష
Sanjay Kasula
|

Updated on: Aug 31, 2020 | 12:13 PM

Share

జీఎస్టీ పరిహారం చెల్లింపునకు సంబంధించి కేంద్రం రాష్ట్రాల ముందు ఉంచిన ప్రతిపాదనలపై తెలంగాణ ప్రభుత్వం మరికాసేపట్లో నిర్ణయాన్ని ప్రకటించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనునుంది. వన్ నేషన్.. వన్ టాక్స్  నినాదంతో 2017 నుంచి (GST) జీఎస్టీని కేంద్రం అమలు చేస్తోంది.

పెట్రోల్‌, మద్యం మినహా దాదాపు అన్నింటిని జీఎస్టీలోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో తమకు భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉందన్న రాష్ట్రాల ఆందోళనలు చేశాయి. ఐదేళ్ల వరకు రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే ప్రతి ఏడాది, అంతకు ముందు ఏడాది వచ్చిన జీఎస్టీ రాబడుల మొత్తంతో బేరీజు వేసి.. దానికి కంటే 14శాతం అదనంగా చేర్చి ఒక బెంచ్‌ మార్కును నిర్ణయిస్తుంది.

ఇటీవల జరిగిన 41వ కౌన్సిల్‌ సమావేశం వర్చువల్‌ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిహారంపై రెండు ప్రతిపాదనలు రాష్ట్రాల ముందు ఉంచింది. మొదటి ప్రతిపాదనలో రూ.97వేల కోట్లుగా అంచనా వేయగా.. ఈ మొత్తాన్ని కేంద్రం ఆర్‌బీఐ(RBI) ద్వారా రుణంగా రాష్ట్రాలకు పరిహారంగా ఇప్పిస్తుంది. అసలు, వడ్డీ కేంద్రమే చెల్లిస్తుంది. రెండో ప్రతిపాదనలో కరోనాతో నష్టపోయిన జీఎస్టీ రూ.2.37లక్షల కోట్ల రుణాల ద్వారా సమకూర్చనుంది. ఇందులో అసలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. వడ్డీని రాష్ట్రాలు చెల్లించుకోవాలని చెప్పింది.

మొదటి ప్రతిపాదనకు అంగీకరిస్తే రాష్ట్రానికి పరిహారం భారీగా తగ్గనుంది. ఇప్పటికే కరోనా ప్రభావంతో రాష్ట్రం భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. రెండో ప్రతిపాదనను పరిశీలిస్తే వడ్డీ భారం పడనుంది. రుణం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో ఉండడంతో రాష్ట్రంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

అయితే సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగే ఉన్నత స్థాయి సమీక్షలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే కేరళ, ఛతీస్‌గఢ్‌, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలు కేంద్రం నిర్ణయాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో రాష్ట్రం తీసుకోనున్న నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.