మరణశిక్ష విధించినా సరే, వాస్తవాలు చెప్పి తీరతానంటున్న చైనా జర్నలిస్టు ఝాంగ్ ఝాన్
నిఖార్సైన జర్నలిస్టులలో ఝాంగ్ ఝాన్ ఒకరు.. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణమైనా వదిలేతటంత ధీరురాలు. కరోనాపై వార్తలు రాసినందుకు ఇప్పుడామె జైలుశిక్షను అనుభవిస్తున్నారు. ఈ ఏడాది మే 10న చైనా ప్రభుత్వం..
నిఖార్సైన జర్నలిస్టులలో ఝాంగ్ ఝాన్ ఒకరు.. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణమైనా వదిలేతటంత ధీరురాలు. కరోనాపై వార్తలు రాసినందుకు ఇప్పుడామె జైలుశిక్షను అనుభవిస్తున్నారు. ఈ ఏడాది మే 10న చైనా ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసింది.. అప్పట్నుంచి జైల్లోనే ఉంటోంది.. తనకు మరణశిక్ష విధించినా అబద్ధం మాత్రం చెప్పనంటున్నారు.. నిజాలను పాతిపెడితే ఎప్పటికైనా అవి మొలకెత్తకమానవంటున్నారామె! చైనాలో ఉహాన్లో కరోనా వైరస్ ప్రబలుతున్నప్పుడు ఆ వార్తలను నిర్భయంగా ప్రపంచానికి అందించారు ఝాంగ్ ఝాన్. 37 ఏళ్ల ఝాంగ్ అక్కడి వాస్తవ పరిస్థితులను మాత్రమే రాశారు తప్ప ఒక్క అక్షరం కూడా తప్పుగా రాయలేదు.. ఇదే చైనా సర్కారుకు కోపం తెప్పించింది.. నిజాలు రాసి ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తావా అంటూ ఝాంగ్పై కోపం పెంచుకుంది.. వెంటనే అంతర్జాతీయంగా చైనా సర్కారు పరువు తీశారన్న నెపంపై ఆమెను అరెస్ట్ చేసింది. ఏడు నెలలుగా ఆమె షాంఘై జిల్లా పుడోంగ్ పట్టణంలోని జైల్లో మగ్గిపోతున్నారు. చైనాలో ఆమెతో పాటు ఇంకా చాలా మంది జర్నలిస్టులు జైలు జీవితం గడుపుతున్నారు. కాకపోతే జైలు జీవితం గడుపుతున్న జర్నలిస్టులలో ఝాంగ్ ఒక్కరే మహిళ! తనను ఉత్తపుణ్యానికే ప్రభుత్వం అరెస్ట్ చేసిందంటూ ఆమె మొదటి రోజు నుంచే నిరాహారదీక్ష చేపట్టారు.. ఇప్పుడామె ఆరోగ్యం బాగా క్షీణించింది.. ముక్కు నుంచి ద్రవహారాన్ని ఎక్కించవలసి వస్తోంది.. తోడు లేకుండా బాత్రూమ్కు వెళ్లలేని దురవస్థత ఆమెది! జైలులో ఉండాల్సి రావడంతో ఆమె మానసికస్థితి కూడా కొంచెం దెబ్బతింది.. నిరసనదీక్షను విరమించమంటూ శ్రేయోభిలాషులు ఎంతగా చెబుతున్నా ఆమె వినిపించుకోవడం లేదు.. ప్రభుత్వం కూడా తన మొండిపట్టు వీడటం లేదు. ఆమె జైల్లోనే చనిపోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉందని ఆమె తరఫు న్యాయవాది అంటున్నారు. వచ్చే సోమవారం రోజు నుంచి షాంఘై పుడోంగ్ న్యూ ఏరియా పీపుల్స్ కోర్టులో విచారణ మొదలవుతుంది. ఆ విచారణలో ఝాంగ్ ఝాన్కు న్యాయం జరుగుతుందన్న నమ్మకమైతే తనకు లేదని ఆమె తరఫు న్యాయవాది అంటున్నారు. అసమ్మతిని చైనా పాలకులు అరాచకంగా భావిస్తున్నంత కాలం ఝాంగ్ఝున్లాంటి జర్నలిస్టులు బలి అవుతుంటారని అన్నారు. ఝాంగ్ఝన్పై చైనా ప్రభుత్వం ఎప్పటి నుంచో గుర్రుగా ఉంది. చైనా చట్టాల పరిధిలోకి రావడానికి ససేమిరా అంటూ, ఆందోళనలు నిరసనలు చేస్తున్న హాంకాంగ్ కార్యకర్తలకు ఝాంగ్ బాసటగా నిలిచినప్పటి నుంచి ప్రభుత్వం ఈమెపై కోపం పెంచుకుంది. హాంకాంగ్లో జరిగిన ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు ఆమెను రెండుసార్లు జైలులో తోసింది చైనా ప్రభుత్వం.. ప్రభుత్వం తనను ఎన్ని రకాలుగా హింసించినా వాస్తవాలను చెబుతూనే ఉంటానని మొక్కవోని ధైర్యంతో చెబుతున్నారు ఝాంగ్..