Chennai Beat Bangalore : చెన్నై జట్టుకు పెద్ద ఊరట లభించింది. వరుస ఓటములతో సతమతం అవుతున్న ఆ జట్టును ఎట్టకేలకు ఓ విజయం వరించింది. బెంగళూరును 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ జట్టు నిర్దేశించిన 146 పరుగుల మోస్తారు లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ 51 బంతుల్లో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా అంబటి రాయుడు, డుప్లెసిస్ చెలరేగి ఆడి ధోనీ సేనకు విజయాన్ని అందించారు. బెంగళూరు బౌలర్లు మందకొడి పిచ్పై వేగంగా బంతులేసి మూల్యం చెల్లించారు.
అంతకుముందు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 43 బంతుల్లో 50 పరుగులు చేశాడు. కోహ్లీకి తోడు డివిలియర్స్ రాణించడంతో బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. ఆరంభంలో దేవదత్ పడిక్కల్ మెరుపులు మెరిపించినా నిలవలేక పోయాడు. శామ్ కరన్, దీపక్ చాహర్ కట్టుదిట్టంగా బంతులేసి బెంగళూరు భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు.