Black fungus: తెలంగాణలో కొత్త గుబులు.. కరోనా తగ్గి, బ్లాక్ ఫంగస్ విజృంభణ.. వాటి వాడకం తగ్గించాలంటున్న నిపుణులు

తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కాస్త తగ్గినట్లు కనిపించినా, మరో ప్రాణాంతక వ్యాధి బ్లాక్ ఫంగస్ పడగవిప్పుతోంది. కరోనా వచ్చిందన్న కంగారులో...ఏదో ఒక మందు వాడటం సరైంది కాదు.

Black fungus: తెలంగాణలో కొత్త గుబులు..  కరోనా తగ్గి, బ్లాక్ ఫంగస్ విజృంభణ.. వాటి వాడకం తగ్గించాలంటున్న నిపుణులు
Black Fungus
Follow us

|

Updated on: May 14, 2021 | 8:34 AM

Black Fungus in Telangana:తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కాస్త తగ్గినట్లు కనిపించినా, మరో ప్రాణాంతక వ్యాధి బ్లాక్ ఫంగస్ పడగవిప్పుతోంది. కరోనా వచ్చిందన్న కంగారులో…ఏదో ఒక మందు వాడటం సరైంది కాదు. కొత్తగా భయపెడుతున్న బ్లాక్ ఫంగస్ వైరస్ కానే కాదు. కొవిడ్ వ్యాధి చికిత్సలో స్టెరాయిడ్లు అధికంగా వాడటం వల్ల తలెత్తే మ్యూకర్మైకోసిస్ వ్యాధినే బ్లాక్ ఫంగస్ అని పిలుస్తున్నారు. దీనిబారినపడితే కళ్లు ఎర్రబారి చూపుకోల్పోవడంతోపాటు అవయవాలు పనిచేయడం మానేసి మృత్యువాతపడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందంటూనే వైద్యఆరోగ్యశాఖ మరో పెద్ద బాంబ్‌ పేల్చింది. తెలంగాణలో కొత్తగా బ్లాక్ ఫంగస్ బాధితులు తెరపైకి రావడంతో…అసలు ఈ బ్లాక్ ఫంగస్ ఏంటి ? ఎందుకొస్తుందనే దానిపై క్లారిటీ ఇచ్చారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. బ్లాక్ ఫంగస్ కొత్త వైరస్ కాదని….కేవలం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లలో మాత్రమే ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. అంతే కాదు గాంధీలో మూడు బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నట్లు తెలిపారు. అయితే బ్లాక్ ఫంగస్‌పై రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు అధికారులు. రెమిడిసివిర్ అనవసరంగా వాడితేనే ఈ ప్రమాదం వచ్చే అవకాశముందంటున్నారు. ఈ తరహా కేసులు వస్తే.. వెంటనే గాంధీ ఆసుపత్రికి పంపటం తగదని ప్రైవేటు ఆస్పత్రులకు సూచించారు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు.

ఇక రాష్ట్రంలో రెమ్‌డెసివిర్ కొరత 2-3 రోజుల్లో తీరుతుందన్నారు అధికారులు. మెరుగైన సేవలందించేందుకు తాత్కాలిక వైద్య సిబ్బందిని నియమించనున్నట్లు చెబుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన 1,300 వెంటిలేటర్లలో వంద వరకు పనిచేయడం లేదన్నారు. కింగ్ కోఠి ఘటనలో ఆక్సిజన్ అందక చనిపోలేదని..మృతుల ఆరోగ్య పరిస్థితి బాగలేక చనిపోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మే 31 వరకు 15 లక్షల మందికి సెకండ్ డోస్ వేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. లాక్ డౌన్ ఫలితాలు రావాలంటే ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

ఇక రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత కారణంగా 18 నుంచి 44 ఏళ్ల వారికి ఇప్పట్లో టీకాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణలో లేదు. మే 31 వరకు రెండోడోసు వారికే వ్యాక్సిన్‌ ఇస్తామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లోనే లాక్‌డౌన్‌ విధించిందని ఆయన అన్నారు. ప్రభుత్వం అనుమతించిన 4 గంటల్లోనే బయటకు రావాలని సూచించారు. ప్రజలు బయటకు వచ్చిన సమయంలోనూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. Read Also… Ramzan–Eid-ul-Fitr: ఇవాళ ఘనంగా ఈద్ ఉల్ ఫితర్.. ఇళ్లకే పరిమితమైన ప్రార్థనలు.. గతంలోనూ ఇలాగే.. ఎప్పుడంటే..?