ఈ నెల 12న జనసేన–బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..!
ఏపీలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఈనెల 12న తమ మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు బీజేపీ -జనసేన నేతలు స్పష్టం చేశారు. విజయవాడలో ఇరు పార్టీల ముఖ్యనేతలు సమావేశమై స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై
ఏపీలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఈనెల 12న తమ మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు బీజేపీ -జనసేన నేతలు స్పష్టం చేశారు. విజయవాడలో ఇరు పార్టీల ముఖ్యనేతలు సమావేశమై స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సుమారు రెండు గంటలపాటు చర్చించారు. సమావేశం అనంతరం భాజపా నేత పురందేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. జిల్లా, అసెంబ్లీ, మండల స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు.
కాగా.. రాష్ట్రంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని.. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పురందేశ్వరి చెప్పారు. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకే ఇంత తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆమె ఆక్షేపించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇరుపార్టీల పొత్తుతో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు. ప్రజలు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని ఓట్లు వేయాలని ఆయన కోరారు.