సాధారణంగా జ్వరంతో ఆసుపత్రికి వెళ్తే.. ఏదో ఒక టాబ్లెట్ లేదా ఇంజెక్షన్ ఇచ్చి 100 రూపాయలు ఫీజు తీసుకుని ఇంటికి పంపిస్తారు. అయితే ఓ కోలీవుడ్ నటి ఫీవర్తో హాస్పిటల్కు వెళ్తే ఏకంగా లక్ష బిల్లు వేసి పంపించారని ఆమె వాపోయింది. ‘కౌస్యల కృష్ణమూర్తి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న తమిళ నటి ఐశ్వర్య రాజేష్కు ఈ విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఆమె తాజాగా తమిళంలో నటించిన ‘మేయ్’ సినిమా ప్రెస్ మీట్లో ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ.. ‘ఇటీవల నాకు జ్వరం వచ్చి.. వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఉన్న డాక్టర్స్ నాకు వైద్య పరీక్షలు చేశారు. వార్డ్లో చేరమని చెప్పి.. మరుసటి రోజు డిశ్చార్జ్ చేశారు. ఇక ఆ సమయంలో వాళ్ళు ఏకంగా లక్ష బిల్లు ఇచ్చారు. అదీ కూడా కేవలం వైద్య పరీక్షలకు అంత మొత్తం అయిందని చెప్పారు. ఒక్కసారిగా షాక్ అయినా.. బిల్లు కట్టక తప్పలేదు. తీరా వెళ్ళేటప్పుడు సాధారణ డోలో 650 టాబ్లెట్స్ ఇచ్చి పంపించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేసింది.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఆమె తమిళంతో పాటు తెలుగులో కూడా పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఆమె చేతిలో దాదాపు 14 సినిమాలు ఉన్నాయి.