Andhra Pradesh: మట్టితో పనిలేకుండా..రసాయనాలు వాడకుండా లాభసాటి వ్యవసాయం చేస్తున్న ఆంధ్రా కుర్రాడు..

నిండా పాతికేళ్లు కూడా నిండని ఈ కుర్రాడు రసాయనాలు లేని కూరగాయలు, ఆకుకూరలను పండించి సూపర్ మార్కెట్లకు చేరవేస్తున్నాడు..

Andhra Pradesh: మట్టితో పనిలేకుండా..రసాయనాలు వాడకుండా లాభసాటి వ్యవసాయం చేస్తున్న ఆంధ్రా కుర్రాడు..
Hydroponics Farming
Follow us

|

Updated on: Jan 03, 2023 | 3:49 PM

వ్యవసాయం అంటే భూమి దున్నాలి. ఎరువు వేయాలి. గింజలు చల్లాలి. నాట్లు వేయాలి. పరుగుపుట్రా పట్టకుండా రసాయనాలు చల్లాలి. తీరా పంట చేతికొచ్చే సమయానికి వాన దేవుడు విపత్తు సృష్టించి కల్లోలంచేసి వెళ్తాడు. మిగిలిన అరకొర పంటను మార్కెట్లో అమ్మితే కనీసం పెట్టుబడి డబ్బుకూడా రాకపోయినా రైతు కన్నీళ్లు దిగమింగుకుని.. తర్వాత వేయాల్సిన పంటగురించి ఆలోచిస్తాడు. వ్యవసాయం అంటే ఆదాయంలేని పని అనే నమ్మకం ఇప్పటికే ఎందరికో అనుభవ పూర్వకంగా తెలిసొచ్చింది. ఐతే తాజాగా మట్టితో పనిలేకుండా చేసే ఆధునిక వ్యవసాయ పద్ధతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. నీళ్ల పైపుల్లో.. కేవలం నీళ్లతోనే పంటలను పండించి మంచి ఆదాయం గడిస్తున్నాడు ఈ తిరుపతి కుర్రాడు సందీప్ కన్నన్‌. నిండా పాతికేళ్లు కూడా నిండని ఈ కుర్రాడు రసాయనాలు లేని కూరగాయలు, ఆకుకూరలను పండించి సూపర్ మార్కెట్లకు చేరవేస్తున్నాడు.

ఈ యువ రైతు తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ (TNAU) నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేశాడు. అనంతరం తిరుపతి నగర శివారులోని తనపల్లె మార్గంలో ఉన్న ముళ్లపూడిలో అర ఎకరం భూమిలోనే పాలీహౌస్ హైడ్రోపోనిక్ ఫార్మింగ్‌ను తయారు, ఎన్ఎఫ్టీని పైపులు అమర్చాడు. ఇందులో భాగంగా మొదటగా నెట్ పాట్ కప్పుల్లో కొబ్బరి పీచులను నింపి వాటిని ఎన్ఏఫ్టీ పైపుల్లో అమర్చాడు. ఈ విధంగా దాదాపు 12 పైపుల్లో 700 మొక్కులు సాగు చేసే విధంగా బల్లను నిర్మించాడు. ఇలాంటి 23 బల్లలు ఒకదానపై ఒకటి ఏర్పాటు చేశాడు. ఒక్కో మొక్క నుంచి 40 నుంచి 50 గ్రాముల ఆకుకూర ఉత్పత్తి అవుతుంది. కోత సమయానికి ఆకుకూరలను కట్ చేసి కవర్లలో ఫ్యాక్ చేసి సూపర్ మార్కెట్‌లకు సరఫరా చేస్తాడు. కీరా, క్యాప్సికం, బీరా,టమోటాలు, చుక్కకూర, పుదినా, మెంతుకూర, పాలకూర, బచ్చలికూర, ఎరుపు అమరనాథ్, కాలే తులసి, బ్రోకోలీ, పాక్ చోయ్ (చైనీస్ క్యాబేజీ) వంటి తదితర పంటలను పండిస్తున్నారు.

సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలతో పోల్చితే హైడ్రోపోనిక్ ద్వారా పండించే కూరగాయల్లో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయని అంటున్నాడు. అంతేకాకుండా వ్యవసాయానికి పెట్టుబడి కూడా చాలా తక్కువట. ఇక్కడి మొక్కలకు తగుమోతాదులో ఉష్ణోగ్రత అందించడం వల్ల వాటి పెరుగుదలకు సహాయపడుతుందని అంటున్నాడు. ఇక పంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు భిన్నంగా, హైడ్రోపోనిక్ వ్యవసాయంలో అతి తక్కువ నేలతో మెరుగైన దిగుబడిని పొందవచ్చని తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. మొక్కలను నియంత్రిత వాతావరణంలో 45 నుండి 60 రోజుల పెంచితేచాలు కోతకు వస్తాయని అంటున్నాడు.

ఇవి కూడా చదవండి

సేంద్రియ వ్యవసాయంలో పంటకు వచ్చే తెగుళ్ల నివారణకు బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్. వేప నూనెను ఉపయోగిస్తారు. ఐతే హైడ్రోపోనిక్స్ వ్యవసాయంలో పంట మట్టిలో ఉండదు కనుక తెగుళ్ల శాతం తక్కువగా ఉంటుంది. ఇలా పండించిన కూరగాయలకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో మంచి డిమాండ్ ఉందని సందీప్ తెలిపారు. వ్యవసాయంపై మక్కువ ఉన్న నిరుద్యోగులు, రైతులు అతని పాలీహౌస్ హైడ్రోపోనిక్స్ వ్యవసాయాన్ని సందర్శించి, మెళకువలు తెలిసుకునేందుకు పోటెత్తడంతో ప్రస్తుతం అతని పాలీహౌస్ విజ్ఞాన కేంద్రంగా మారింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి.