Pakistan: హిందువుల గురించి పాకిస్తాన్ పాఠశాలల్లో ఏం చెబుతున్నారో తెలుసా.?
పాకిస్తాన్ పాఠశాలల పాఠ్యపుస్తకాల్లో హిందువులు, సిక్కులపై తప్పుడు సమాచారాన్ని భోదిస్తున్నారు. చరిత్రను వక్రీకరిస్తూ హిందువులను క్రూరంగా, నమ్మకద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఇది హిందూ మైనారిటీల పట్ల ద్వేషాన్ని పెంచుతుందని, మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు ఆవేదన వ్యక్తమవుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

పాకిస్తాన్ పాఠశాలల్లో హిందువులు, సిక్కుల గురించి బోధించే విషయాలు అక్కడి మత సామరస్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఒక నివేదిక వెల్లడించింది. పాఠ్యపుస్తకాల్లోని తప్పుడు, వివాదాస్పద సమాచారం మైనారిటీలపై దురభిప్రాయాలను సృష్టిస్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక హిందూ పౌరుడు తన అనుభవాలను పంచుకుంటూ.. తన మతం మంచిది కాదని, ముస్లిం మతంలోకి మారాలని పాఠ్యపుస్తకాల ఆధారంగా కొందరు సూచించారని ఆయన పేర్కొన్నారు.
పాకిస్తాన్ పాఠ్యపుస్తకాల్లో హిందువుల గురించి అనేక అభ్యంతరకర విషయాలు ఉన్నాయి. 8వ తరగతి సోషల్ స్టడీస్ పుస్తకంలో హిందువులు తమ కూతుళ్లను సరిగ్గా చూసుకునేవారు కాదని, ప్రాచీన కాలంలో వారిని సజీవంగా పాతిపెట్టేవారని బోధిస్తున్నారు. విగ్రహారాధన చేసేవారంతా దేవుణ్ని నమ్మనివారేనని కూడా నేర్పుతున్నారు. 11వ, 12వ తరగతుల పాకిస్తాన్ స్టడీస్ పాఠ్యపుస్తకం 33వ పేజీలో హిందువులు, సిక్కులు వేలాది మంది ముస్లిం మహిళలు, పిల్లలు, వృద్ధులను నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా చంపారని, అత్యాచారం చేశారని రాసి ఉంది. ఇది కేవలం ఒక వైపు చరిత్రను మాత్రమే ప్రచారం చేస్తూ, హిందువులు అమానవీయులనే తప్పుడు అభిప్రాయాన్ని విద్యార్థుల మనస్సుల్లో నాటుతోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి అల్లర్లు రెండు వైపుల నుంచి జరుగుతాయని, కానీ ఇక్కడ ఒక పక్షాన్ని మాత్రమే తప్పుబడుతున్నారని అన్నారు.
బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం సాధించేందుకు హిందువుల రాజకీయ ఉద్యమంలో ముస్లింలు పాల్గొన్నారని, అయితే హిందువులు ప్రతి సందర్భంలోనూ ముస్లింలకు ద్రోహం చేశారని 8వ తరగతి సోషల్ స్టడీస్ పుస్తకం పేర్కొంటుంది. 9వ, 10వ తరగతుల పాకిస్తాన్ స్టడీస్ పుస్తకం ఖిలాఫత్ ఉద్యమం గురించి రాస్తూ, హిందూ-ముస్లిం పొత్తు ఎక్కువ కాలం కొనసాగలేదని, దానికి కారణం హిందువుల ముస్లిం వ్యతిరేక స్వభావమేనని చెబుతుంది. ముస్లింల రాకకు ముందు హిందువులకు వస్త్రధారణ కూడా తెలియదని, వారు ఒకటి రెండు పీలికలతో శరీరాన్ని కప్పుకునేవారని, కుట్టిన దుస్తులను ముస్లింలు మొట్టమొదటిసారిగా పరిచయం చేశారని పుస్తకాల్లో ఉంది. హిందూ సమాజం మత దురభిమానంతో చచ్చుబడిపోయిందని, మహిళల స్థానం హీనంగా ఉండేదని కూడా రాశారు.
