Andhra Pradesh: భర్త కోసం మహిళ పోరాటం.. ఏకంగా టెంట్ వేసి నిరసన దీక్ష

| Edited By: Balaraju Goud

Mar 19, 2024 | 5:25 PM

ఆషాడమాసం పూర్తయిన తర్వాత కాపురానికి తీసుకు వెళ్లలేదు. పెళ్లైన రెండు నెలలకే అత్త మామ ఆడపడుచు తనపై ప్రేమ విరిగిపోయేలా చేశారని దుర్గ భవాని ఆరోపిస్తుంది. ఆ క్రమణంలోనే తనకు న్యాయం చేయాలని గ్రామంలో పెద్ద మనుషుల వద్ద పంచాయతీ నిర్వహించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

Andhra Pradesh: భర్త కోసం మహిళ పోరాటం.. ఏకంగా టెంట్ వేసి నిరసన దీక్ష
Married Woman Protest
Follow us on

భర్త ప్రాణాల కోసం యముడితో సైతం పోరాడిందీ సతీ సావిత్రి. చివరికి ఆ యముడినే ప్రసన్నం చేసుకుని తన భర్త ప్రాణాలు దక్కించుకుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని అలాంటి ఘటనలు నేపథ్యంలో ఆ సావిత్రిని గుర్తుకు తెస్తున్నాయి. ఇప్పటికే భర్త భార్యలు ఎన్నో త్యాగాలు చేసిన ఘటనలు మనం చూశాం. కొన్ని ఘటనలలో అయితే అనారోగ్యంలో ఉన్న భర్తకు తానే స్వయంగా తన అవయవాలను దానం చేసిన భార్యల గురించి విన్నాం. అయితే ఇక్కడ అనారోగ్య సమస్య కాకపోయినా తన భర్త తనకు కావాలని, తన భర్తతో సంసారం చేసుకునేలా తనకు న్యాయం చేయాలని ఓ మహిళ దీక్ష చేపట్టింది.

న్యాయం కోసం నిరసన, భర్త కోసం మహిళ పోరాటం.. ఏకంగా ఫ్లెక్సీ ఏర్పాటు దీక్షకు కూర్చుంది ఆ మహిళ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలేం గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తికి ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామానికి దుర్గ భవాని అనే యువతితో గత సంవత్సరం మే నెలలో వివాహం జరిగింది. వివాహం జరిగిన ఒక నెల తరువాత ఆషాడ మాసం రావడంతో రామాంజనేయులు తన భార్యను జి కొత్తపల్లిలోని ఆమె పుట్టింట్లో విడిచి వెళ్ళాడు.

అయితే ఆషాడమాసం పూర్తయిన తర్వాత కాపురానికి తీసుకు వెళ్లలేదు. పెళ్లైన రెండు నెలలకే అత్త మామ ఆడపడుచు తనపై ప్రేమ విరిగిపోయేలా చేశారని దుర్గ భవాని ఆరోపిస్తుంది. ఆ క్రమణంలోనే తనకు న్యాయం చేయాలని గ్రామంలో పెద్ద మనుషుల వద్ద పంచాయతీ నిర్వహించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత లక్కవరం, ద్వారకా తిరుమల, ఏలూరు దిశా పోలీస్ స్టేషన్లలో తనకు న్యాయం చేయాలని పోలసులను అశ్రయించింది యువతి. అయితే పోలీసులు తన భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత తను మారి తనతో కాపురం చేయడానికి ఒప్పుకున్నాడని యువతి తెలిపింది. అయితే అత్త, మామ, ఆడపడుచు, ఆడపడుచు భర్త అయినటువంటి కానిస్టేబుల్ తన భర్త నుండి తనని ఎలాగైనా వేరు చేయాలని ప్రయత్నించారని ఆరోపించింది. అత్తగారు తనను చిత్రహింసలు పెట్టారని దుర్గ భవాని ఆవేదన వ్యక్తం చేసింది.

పోలీసులు, పెద్ద మనుషుల నిర్ణయం మేరకు మూడు నెలల క్రితం అమ్మపాలెంలో తన భర్తతో కలిసి వేరే కాపురం పెట్టామని, ఇద్దరు కలిసి ఆనందంగా ఉంటున్న సమయంలో అత్త, ఆడపడుచు భర్త ఇంటికి వచ్చి తన భర్తను వారి ఇంటికి తీసుకువెళ్లి తన వద్దకు కాపురానికి రాకుండా అడ్డుకుంటున్నారని గోడు వెళ్లబోసుకుంది మహిళ. తన సంసారానికి అత్త, ఆడపడుచు, ఆడపడుచు భర్త అడ్డుపడుతున్నారని రోడ్డు పక్కన టెంట్ వేసి, ఫ్లెక్సీ ఏర్పాటు చేసి న్యాయం కోసం నిరసన దీక్ష చేపట్టింది దుర్గా భవాని. సమాచారం తెలుసుకున్న లక్కవరం ఎస్సై సుధీర్ తనకి న్యాయం చేస్తామని, తనకు అన్యాయం చేసిన వారిపై ఫిర్యాదు ఇవ్వమని కోరిన ఆమె నిరాకరించిoది. తన భర్త తన దగ్గరికి వచ్చే వరకు దీక్ష మాననని శపథం పట్టింది.

అయితే భర్త రామాంజనేయులు బంధువులు మాత్రం తరచూ భార్యాభర్తలు మధ్య గొడవలు జరుగుతున్నాయని, దుర్గా భవాని తన భర్త రామాంజనేయులుని మానసికంగా హింసిస్తుందని, ఈ క్రమంలోనే రామాంజనేయులు తన భార్య పెట్టే హింస భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని అంటున్నాడని, వారిద్దరు కలిసి ఆనందంగా కాపురం చేసుకుంటే తమకు ఎటువంటి ఇబ్బంది లేదంటున్నారు కుటుంబసభ్యులు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెైస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…