జస్ట్ రూ.3 వేలతో హైదరాబాద్ టూ పాపికొండలు టూర్! తిండి, ట్రావెల్, స్టేయింగ్.. అంతా అందులోనే..
హైదరాబాద్ నుండి పాపికొండలు యాత్ర అధిక ఖర్చుతో కూడుకున్నది అనుకుంటున్నారా? సరైన ప్రణాళికతో కేవలం రూ.3,000 లోపే ఈ అద్భుత ప్రయాణం పూర్తి చేయవచ్చు. రైలు, బోట్ ప్యాకేజీలను విడివిడిగా బుక్ చేసుకొని ఖర్చు తగ్గించుకోవచ్చు. సికింద్రాబాద్ నుండి భద్రాచలం వరకు రైలు ప్రయాణం, ఆపై బోట్ టూర్ ద్వారా గోదావరి అందాలను ఆస్వాదిస్తూ పాపికొండల ప్రకృతిని చూడవచ్చు.

హైదరాబాద్ నుంచి పాపికొండలు వెళ్లాలంటే చాలా డబ్బు ఖర్చవుతుందని చాలామంది భావిస్తారు. కానీ సరైన ప్లానింగ్ ఉంటే ఒక్కో వ్యక్తి కేవలం రూ.3,000లోపే అద్భుతమైన ట్రిప్ పూర్తి చేయవచ్చు. అందుకోసం పూర్తి టూర్ ప్యాకేజీ తీసుకోవడం కంటే రైలు, బోట్ ప్యాకేజీలను విడివిడిగా బుక్ చేసుకోవడం ఉత్తమ మార్గం. ముందుగా సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) వరకు వెళ్లే రెండు ట్రైన్స్ ఉన్నాయి. ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు కాకతీయ ఎక్స్ప్రెస్, రాత్రి 11 గంటల 45 నిమిషాలకు మణుగురు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటాయి. వీటిలో కాకతీయకు టిక్కెట్ రేటు (రూ.148 నుంచి రూ.481) చాలా తక్కువ రద్దీ కూడా ఉండదు. మణుగూరు ఎక్స్ప్రెస్కు కాస్త టిక్కెట్ రేట్(రూ.253 నుంచి రూ.806) కాస్త ఎక్కువ, రద్దీ కూడా ఎక్కువే. ఉదయం కొత్తగూడెం చేరుకున్న తర్వాత భద్రాచలం వరకు ఆర్టీసీ బస్సు లేదా షేరింగ్ ఆటోలో రూ.60 నుంచి రూ.100 మధ్యలో చేరుకోవచ్చు.
భద్రాచలంలో రాత్రి బస చేయాలనుకుంటే దేవస్థానం అతిథి గృహాల్లో రూ.500 నుంచి గదులు లభిస్తాయి. అలాగే బడ్జెట్ హోటళ్లలో కూడా తక్కువ ధరల్లో గదులు అందుబాటులో ఉంటాయి. ముందుగానే బుకింగ్ చేసుకుంటే మరింత సౌకర్యంగా ఉంటుంది. తరువాత రోజు ఉదయం భద్రాచలం నుంచి నిర్వహించే పాపికొండలు వన్ డే బోట్ టూర్లో వెళ్లవచ్చు. స్థానిక ట్రావెల్ ఆపరేటర్లు లేదా ఆన్లైన్లో ఈ ప్యాకేజీని ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఒక్కో వ్యక్తికి సుమారు రూ.1,100 నుంచి రూ.1,300 వరకు ఖర్చవుతుంది. ఈ ప్యాకేజీలో బోట్ ప్రయాణంతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్నాక్స్ కూడా ఉంటాయి. ఈ బోట్ యాత్రలో గోదావరి నది అందాలను ఆస్వాదిస్తూ పాపికొండల మధ్య ప్రయాణించే అవకాశం లభిస్తుంది. అలాగే పోలవరం ప్రాంతం, పేరంటపల్లి ఆలయం వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రయాణం మరపురాని అనుభూతిని అందిస్తుంది. సాయంత్రం బోట్ ట్రిప్ ముగిసిన తర్వాత తిరిగి భద్రాచలం చేరుకుని అక్కడి నుంచి రాత్రి రైలు లేదా ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు తిరుగు ప్రయాణం చేయవచ్చు. తిరుగు రైలు టికెట్కు కూడా సుమారు రూ.230 ఖర్చవుతుంది.
- అంచనా ఖర్చు (ఒక్కో వ్యక్తికి):
- రైలు (వెళ్లడం + రావడం): రూ.460
- లోకల్ బస్సు/ఆటో: రూ.150–200
- బోట్ ప్యాకేజీ: రూ.1,100–1,300
- వసతి: రూ.500 (షేరింగ్ అయితే ఇంకా తక్కువ)
- ఇతర ఖర్చులు: రూ.300–400
మొత్తంగా రూ.2,700 నుంచి రూ.3,000 మధ్యలో హైదరాబాద్ నుంచి పాపికొండల వరకు అద్భుతమైన వీకెండ్ ట్రిప్ను పూర్తి చేయవచ్చు. ముందుగానే రైలు టికెట్లు, బోట్ ప్యాకేజీ బుక్ చేసుకుంటే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా, తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది.
