
హర్యానాలో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. సాధారణంగా చిన్న పిల్లలు ఆడుకుంటూ ఏదో ఒక వస్తువును నోట్లో వేసుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ, ని ఫరీదాబాద్ జిల్లాలో ఒక రెండేళ్ల బాలుడు ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం అందరినీ కలవరపెట్టింది. ఈ ఘటన ఫరీదాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఫరీదాబాద్కు చెందిన ఒక రెండేళ్ల బాలుడు గత కొన్ని రోజులుగా తీవ్రమైన దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. వాతావరణ మార్పుల వల్ల వచ్చే సాధారణ జబ్బు అని భావించిన తల్లిదండ్రులు స్థానిక వైద్యులకు చూపించారు. ఎన్ని మందులు వాడినా పరిస్థితి మెరుగుపడకపోగా, బాలుడికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు మే 11న బాబును ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి తరలించారు.
వైద్యులు బాలుడికి ఎక్స్రే, స్కాన్ నిర్వహించగా అసలు విషయం బయటపడింది. బాలుడి కుడి ఊపిరితిత్తుల శ్వాసనాళంలో ఒక చిన్న రిమోట్ కంట్రోల్ బల్బ్ (IR LED) ఇరుక్కుపోయి ఉండటాన్ని చూసి డాక్టర్లు షాక్కు గురయ్యారు. ఆడుకుంటూ టీవీ రిమోట్లోని బల్బును పీకేసిన ఆ చిన్నారి, దానిని మింగేయడంతో అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిందని వైద్యులు నిర్ధారణకు వచ్చారు.
బల్బులో లోహపు తీగలు మరియు గాజు ఉండటం వల్ల పరిస్థితి అత్యంత విషమంగా మారింది. అది చాలా రోజులు అక్కడే ఉండటం వల్ల ఊపిరితిత్తులలో వాపు వచ్చి, కణజాలం బల్బు చుట్టూ పేరుకుపోయింది. దీంతో ఆపరేషన్ చేయడం సవాలుగా మారింది. పీడియాట్రిక్ పల్మొనాలజీ, అనస్థీషియా, ENT నిపుణుల బృందం అత్యవసరంగా ‘బ్రాంకోస్కోపీ’ నిర్వహించారు. అత్యాధునిక పరికరాల సాయంతో ఎంతో శ్రమించి ఆ బల్బును బయటకు తీశారు. ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుని క్షేమంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు.
చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. టీవీ రిమోట్లు, ఏసీ రిమోట్లు, మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు లేదా చిన్న చిన్న బ్యాటరీలతో పిల్లలను ఆడుకోనివ్వకూడదు. వాటిలోని చిన్న భాగాలు ఊపిరితిత్తుల్లోకి లేదా గొంతులోకి వెళ్తే క్షణాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన ప్రతి తల్లిదండ్రులకు ఒక గుణపాఠం. పిల్లల చేతికి ఇచ్చే బొమ్మలు, వస్తువుల విషయంలో నిరంతరం నిఘా ఉంచడం ఎంతో అవసరం.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..