Mask Using: నాన్ స్టాప్ గా మాస్క్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..

Mask Using: కరోనా భూచికి భయపడి పెట్టిన మాస్క్ తీయకుండా గంటలకొద్దీ ఉంచుకుంటున్నారా..? నోరు తడి ఆరిపోతున్నట్లు అనిపిస్తుందా..?

Mask Using: నాన్ స్టాప్ గా మాస్క్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..
Mask
Follow us

|

Updated on: Aug 21, 2021 | 8:52 AM

Mask Using: కరోనా భూచికి భయపడి పెట్టిన మాస్క్ తీయకుండా గంటలకొద్దీ ఉంచుకుంటున్నారా..? నోరు తడి ఆరిపోతున్నట్లు అనిపిస్తుందా..? ఎస్.. అనిపిస్తుంది కదా.. ఎందుకంటే మాస్క్ కంటిన్యూగా పెట్టుకోవడంతో లాలాజలం తగ్గిపోతోంది. అంతేకాదండీ దంత సమస్యలు కూడా పెరుగుతున్నాయని వెద్యులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ తప్పనిసరి.. కానీ వదిలిన గాలి మళ్లీ పీల్చడం, మాస్క్ తో నోట్లో దుర్వాసన వెరసి దవడని చేతితో పట్టుకొని “అబ్బా.. చిగుళ్ల నొప్పి”.. అని ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు అంటూనే ఉన్నారు. వాడిన మాస్క్ నే శుభ్రం చేయకుండా మళ్లీమళ్లీ వాడితే ఈ దంత సమస్య తీవ్రత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కరోనా వైరస్ తెచ్చిన తంటాలు అన్ని ఇన్ని కావు. మనం మహమ్మారి నుంచి రక్షణ కోసం పెట్టుకుంటున్న మాస్క్ తో కూడా ముప్పు ఉందంటున్నారు వైద్యులు. కాకపోతే అది కరోనా ముప్పు కాదు. గంటలకొద్దీ మాస్క్ అలాగే ఉంచుకుంటే దంత సమస్యలు తప్పవంటున్నారు డాక్టర్లు. కరోనా సెకండ్ వేవ్ తగ్గాక డెంటిస్ట్ ల వద్ద క్యూలు కూడా ఇది నిజమనే చెబుతున్నాయి.

మాస్క్ మంచిదే.. కానీ ఎక్కువసేపు పెట్టుకోవడంతో నోట్లో లాలాజలం సరిపడా ఊరడం లేదు. నోరు ఎండిపోవడం, ఫలితంగా నోట్లో బ్యాక్టిరీయా బలపడుతోంది. చాలాసేపు మాస్కు ధరించడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తోంది. ఇది పరోక్షంగా గొంతు నొప్పి, చిగుళ్లవాపు, బ్లీడింగ్‌ సమస్యలకు కారణమవుతోంది. నిజానికి 6 నెలలకోసారి దంతాలను క్లీన్‌ చేయించుకోవాలి. లేదంటే పళ్ల చుట్టూ పాచీ పేరుకుపోయి వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్‌లకు నిలయంగా మారుతుంది. దంతాల మధ్యలో పాచీ పేరుకుపోయి చిగుళ్ల సమస్యలు తలెత్తి దంతాలు పటుత్వాన్ని కోల్పోతాయి. రోజంతా మాస్కు ధరించడ వల్ల మంచినీరు తక్కువగా తీసుకుంటున్నారు. దీంతో నోరు ఎండిపోతుంటుంది. ఆ తర్వాత దుర్వాసన రావడమే కాకుండా బ్యాక్టీరియా, వైరస్‌ల వృద్ధికి ఇది కారణమవుతుంది. నోటిలోని బ్యాక్టీరియా వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లకు కారణం అవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో గుండె రక్తనాళాల పనితీరును దెబ్బతీస్తూ గుండెపోటుకు కారణమవుతుంది.

ఇటీవల ఇలాంటి పంటి సమస్యల కేసులు ఎక్కువగా వస్తున్నాయని దంత వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక అప్పటికే దంత వ్యాధులతో బాధపడేవారికి కరోనా సోకితే పరిస్థితి తీవ్రమవుతోందని వైద్యుల పరిశీలనలో తేలింది. చిగుళ్ల వ్యాధులు ఉంటే సైటోకైన్‌ అనే కెమికల్‌ రియాక్షన్‌ జరిగి గొంతుపై ఉండే పైపొరపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొవిడ్‌ సోకగానే ఆ వైరస్‌ నోటి ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోతుంది. సో.. కరోనా ఎఫెక్ట్ త్వరగా శరీరంపై చూపెడుతుంది. వీటన్నింటిని అధిగమించాలంటే మాస్కులు గంటల తరబడి వాడేవారు కొన్ని టిప్స్ పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

సాధారణంగా ప్రతి వ్యక్తి నోట్లో రోజూ లీటరు లాలాజలం ఉత్పత్తవుతుంది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. నోటిని క్లీన్ చేయడానికి, పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని శుభ్రం చేయడానికి ఇది ఉపకరిస్తుంది. తిన్న ఆహారం అరగడానికి ఉపయోగపడే అమైలేజ్‌ ఎంజైమ్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. కడుపులో గ్యాస్‌ను కూడా నియంత్రిస్తుంది. ఇన్ని ఉపయోగాలున్న సెలైవా చాలా మందిలో పూర్తిస్థాయిలో ప్రొడ్యూస్ కావడంలేదు. కారణం.. విరామం లేకుండా మాస్కు వాడడమే.

మహమ్మారి సెకండ్ వేవ్ తో హడలెత్తిన జనం ఇటీవల రెండేసి మాస్కులు పెట్టుకుంటున్నారు. ఇది గాలిని సరిగా పీల్చలేని పరిస్థితికి దారితీస్తుంది. కొందరు ఎన్‌95 మాస్కు వాడుతూనే దాని కింద త్రీ లేయర్ ఉన్న మరో మాస్కును వాడుతున్నారు. దీంతో బయట గాలి అంతగా లోపలికి చొరబడదు. అడపాదడపా నోటి ద్వారానూ శ్వాస తీసుకుంటున్నారు. దీంతో నోరు ఎండిపోతోంది. ఫలితంగా నోట్లోని సూక్ష్మక్రిములు బలపడుతున్నాయి. అప్పటికే కొద్దిగా పుచ్చిన పళ్లపై ఇవి ప్రభావం చూపుతున్నాయి. చిగుళ్లు ఉబ్బడం, రక్తం కారడంతోపాటు నోట్లో దుర్వాసన ప్రారంభమవుతోంది. ఆ తర్వాత పళ్లు కదిలిపోతుండటమే కాకుండా వాటి కింద ఎముకలూ దెబ్బతింటున్నాయి. షుగర్ పేషంట్లలో దీని తీవ్రత అధికంగా ఉంటోంది. చాలా వరకు వీరి దంతాలు దెబ్బతింటున్నాయని వైద్యుల పరిశీలనలో తేలింది. ప్రస్తుతం జనాభాలో 90 శాతం మంది ఏదో ఒక పంటి సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. 45 నుంచి 48 శాతం మందిని పిప్పి పళ్ల సమస్య వేధిస్తండగా.. 75 శాతం మంది చిగుళ్లవాపుతో ఇబ్బంది పడుతున్నారు. వీరందరికీ కరోనా రక్షణ నుంచి వాడే మాస్క్ కూడా ప్రమాదకారిగా మారింది. అంతాబానే ఉంది.

మరీ ఎలాంటి టిప్స్ పాటిస్తే ఈ ప్రమాదం నుంచి కాస్త బయటపడే ఛాన్స్ ఉంది..? అవును.. మాస్క్ మాండేటరీ అయినా ఈరోజుల్లో దంత సమస్యలను అధిగమించాలంటే కొన్ని చిట్కాలు తప్పవు. మీరు ఎన్‌95 మాస్కు వాడుతుంటే అదనంగా మరో మూడు పొరల మాస్కు కాకుండా క్లాత్ మాస్క్ ను పెట్టుకోండి. రీయూజబుల్ మాస్కులను ఎట్టి పరిస్థితుల్లో శుభ్రపరచకుండా తిరిగి పెట్టుకోకండి. అలా చేస్తే బ్యాక్టీరియాకు సందు ఇచ్చినట్లే. ఇక చుట్టూ ఎవరూ లేనప్పుడు లేదా ఆరు అడుగుల దూరంగా ఉన్నప్పుడు కొద్దిసేపు మాస్కు తీసినా ఇబ్బందిలేదు. అలా అయినా కాసేపు బయట గాలి పీల్చుకోవడంతో పాటు సెలైవా ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. డైలీ సరిపడా నీరు తాగుతూ నోరు ఎండిపోకుండా చూసుకోవాలి. నోరు తడి ఆరిపోతుందని అనిపిస్తే వెంటనే మంచినీళ్లు తాగడం మంచిది. డైలీ ఉదయం, సాయంత్రం రెండుసార్లు కచ్చితంగా బ్రష్ చేస్తే తాజాదనంతో పాటు దంతాలు, నోరు ఆరోగ్యంగా ఉంటాయి.

(రిపోర్టర్: విద్యా సాగర్, టీవీ9 తెలుగు)

Also read:

Fish Rates: కోవిడ్ ఎఫెక్ట్‌తో కుదేలైన ఆక్వా రంగం.. భారీగా తగ్గిన చేపల ధరలు.. ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి..

Onion Farmer: ఉల్లిని మార్కెట్‌కు తీసుకురావొద్దు.. కీలక ప్రకటన చేసిన అధికారులు.. అసలు కారణం ఏంటంటే..

Daughter In Law: కూతురు, కోడలు..ఎవరు ఎక్కువ అంటే.. కోడలే ఎక్కువ అంటుంది సనాతన ధర్మం.. ఎందుకంటే