
సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అనే చెప్పాలి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కోట శ్రీనివాసరావు. గతంలో ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు తన నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో ఆసక్తికరమైన అనుభవాలను పంచుకున్నారు. ఆయన కెరీర్కు ప్రతిఘటన చిత్రం ఒక అద్భుతమైన ప్రారంభం. 1985 అక్టోబర్ 11న హైదరాబాద్లోని దీపక్ మహల్లో విడుదలైన ఈ సినిమా అఖండ విజయం సాధించింది. అప్పట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్గా పనిచేస్తున్న కోట శ్రీనివాసరావును చూడటానికి అభిమానులు బ్యాంక్కు చేరుకునేవారట. దీనితో బ్యాంక్ మేనేజర్ ఆయనను క్యాష్ కౌంటర్ నుండి వెనక సీటుకు మార్చినా, అభిమానుల తాకిడి తగ్గకపోవడంతో చివరికి హెడ్ ఆఫీస్కు బదిలీ చేయాల్సి వచ్చిందట.
ప్రతిఘటన సినిమా విజయం కోట శ్రీనివాసరావును రాత్రికి రాత్రే ఓవర్నైట్ స్టార్గా మార్చింది. ఇండస్ట్రీలో రావు గోపాల్ రావు, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, నూతన్ ప్రసాద్ వంటి దిగ్గజాలు ఉన్న సమయంలో కోట శ్రీనివాసరావు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కొన్ని సందర్భాలలో రోజుకు 20 గంటలు పనిచేస్తూ, కార్లు లేదా రైళ్లలో నిద్రపోతూ, తొమ్మిది, పది రోజుల్లో మూడు వేర్వేరు రాష్ట్రాల్లో – హైదరాబాద్, మద్రాస్ (చెన్నై), బెంగళూరు (కర్ణాటక) – షూటింగ్లలో పాల్గొనేవారట. అప్పట్లో ఎయిర్పోర్ట్లలో మీడియా హడావిడి, సెక్యూరిటీ తక్కువగా ఉండటంతో అక్కడే స్నానం చేసి షూటింగ్లకు వెళ్లేవారట. పని ఒత్తిడిని భరించలేక విసుగు చెందిన కమెడియన్ వేణు మాధవ్కు “ఆర్టిస్టుకు టైం వస్తే టైం ఉండదు. జీవితం వాడి చేతిలో ఉండదు. టైం బాగున్నంతవరకు బిజీ ఉంటుంది కాబట్టి విసుక్కోవద్దు” అని సలహా ఇచ్చానని కోట శ్రీనివాసరావు గుర్తుచేసుకున్నారు. ఆయన కెరీర్లో మండలాధీశుడు సినిమా ఒక ముఖ్యమైన ఘట్టంమని. సూపర్ స్టార్ కృష్ణగారు ఈ సినిమాలో నటించమని బలవంతం చేయగా, అప్పటికే పెద్దాయన ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో, వివాదాలు వస్తాయేమోనని మొదట సంశయించారట.
అయితే కృష్ణగారు, జ్యోతి ప్రసాద్ వంటి వారి ప్రోత్సాహంతో నటించడానికి అంగీకరించా.. సినిమా భారీ విజయం సాధించినప్పటికీ, విజయవాడ రైల్వే స్టేషన్లో ఎన్.టి.రామారావు అభిమానుల ఆగ్రహానికి గురయ్యారట. ఒకసారి ఖమ్మం నుంచి విజయవాడ వస్తున్నప్పుడు, రామారావు గారి ఓ కార్యక్రమం కారణంగా స్టేషన్ అంతా తెలుగుదేశం జెండాలతో నిండి ఉందట. అదే సమయంలో రైలు దిగగానే కోట శ్రీనివాసరావును గుర్తించిన అభిమానులు ఆయనపై దాడి చేసి, బూతులు తిట్టారట. ఈ ఘటనలో దెబ్బలు కూడా తిన్నానని ఆయన తెలిపారట. ఈ సంఘటన గురించి కృష్ణగారికి తెలిసినప్పుడు, ఆయన సరదాగా “ఏమయ్యా, బెజవాడలో మిమ్మల్ని కొట్టారంట కదా!” అని నవ్వుతూ అడిగేవారని కోట శ్రీనివాసరావు తెలిపారు. కృష్ణగారు చాలా సరదా మనిషి అని, చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో కలిసిపోయేవారని ఆయన పేర్కొన్నారు.