
తెలుగులో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నారు. హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో నటుడు అశోక్ కుమార్ ఒకరు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించి అలరించారు అశోక్ కుమార్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అశోక్ కుమార్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆ కాలానికి ఈ కాలానికి తేడా ఏంటంటే ఆ కాలంలో డైరెక్ట్ యాక్సెస్ ఉండటం వల్ల బాండింగ్ బాగా స్ట్రాంగ్ గా ఉండేది అని అశోక్ కుమార్ అన్నారు. నందమూరి తారక రామారావు వంటి లెజెండరీ నటుల ఇంటికి కూడా టీనగర్ లో ఏ ఆర్టిస్టైనా నేరుగా వెళ్లి కలవగలిగేవారని ఆయన అన్నారు.
దర్శకులు, నిర్మాతలు తమ కార్యాలయాల్లో సులభంగా అందుబాటులో ఉండేవారని, కేవలం పదిహేను నిమిషాల్లో వారిని కలిసి మాట్లాడి వెళ్లగలిగేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఒక నటుడు కనిపించకపోతే, తోటి నటులు, దర్శకులే అతనికి ఫోన్ చేసి, “ఏంటి మీరు ఖాళీగా ఉన్నారా ఏంటి పరిస్థితి? వేషాలు లేవా.? అవునా? కో-డైరెక్టర్ని పిలిచి ఇందులో ఏం వేషం ఉంది? అది రేపు చెయ్. అడ్వాన్స్ ఇచ్చి పంపించు” అనేలా ఉండేది , ప్రస్తుత కాలంలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అశోక్ కుమార్ అన్నారు. ఇప్పుడు ఏ నటుడినైనా, దర్శకుడినైనా, నిర్మాతలనైనా నేరుగా కలవడం అసాధ్యమని ఆయన అన్నారు. అవకాశాల కోసం అడగడానికి పెద్ద స్టార్లను సంప్రదించడం దాదాపు అసాధ్యమని, చాలా మంది నటీనటులు వందల సినిమాలు చేసి కూడా మొఖం చూసే అవకాశం కూడా ఇవ్వట్లేదు అని బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
చిరంజీవి గారితో ఖైదీ 786 సినిమా చేసిన తర్వాత, తాను ఆయన అభిమాన సంఘాల కార్యక్రమాలకు ఆయన ప్రతినిధిగా వెళ్ళేవాడినని, చిరంజీవి గారి షూటింగ్ కు వెళ్ళి నేరుగా కలిసేవాడినని చెప్పారు. బాలకృష్ణ గారిని కూడా గతంలో నేరుగా కలిసేవాళ్ళమని, వారి కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయని అశోక్ కుమార్ వివరించారు. కానీ ఇప్పుడు బాలయ్య బాబు ఇంటి దగ్గర కలవాలంటే 14 క్వశ్చన్లు ఉంటాయని, అందుకే షూటింగ్ లోకేషన్ లో కలవడమే సులభమని ఆయన అన్నారు. పరిశ్రమలోని వారి పట్ల కూడా ఈ అడ్డంకులు ఉన్నాయని, ఎవర్నీ కలవలేం సార్ అని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.