Nagarjuna: ఏడు ఫ్లాప్ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
నాగార్జున 'ప్రెసిడెంట్ గారి పెళ్ళాం' మూవీ వెనుక స్టోరీని రచయిత తోటపల్లి మధు వెల్లడించారు. చిరంజీవి కోసం రాసిన ఈ కథ, మొదట చిన్న హీరోలకు సరిపోతుందని నో చెప్పారు. దొరస్వామిరాజు చొరవతో నాగార్జునను చేరి, స్క్రిప్ట్పై ఆయన వెంటనే ఓకే తెలిపారు.

అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రం ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’ వెనుక స్టోరీని రచయిత తోటపల్లి మధు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరించారు. 90వ దశకం ఆరంభంలో తాను చాలా బిజీగా ఉన్న సమయంలో, చిరంజీవి కోసం ఒక గ్రామీణ నేపథ్యం కలిగిన విభిన్నమైన కథను సిద్ధం చేయాలనే ఆశ మధుకు ఉండేదట. అక్కినేని నాగేశ్వరరావు నటించిన మంచి రోజులు వచ్చాయి చిత్రం నుంచి ఒక ఔట్లైన్ను తీసుకొని, రెండవ భాగాన్ని పూర్తిగా మార్చి, కొత్త పాత్రలతో ఈ కథను తీర్చిదిద్దారు. మొదట ఈ కథను కోదండరామిరెడ్డికి వివరించగా, ఆయన దీనిని పెద్ద హీరోలకు కాకుండా చిన్న హీరోలకు సరిపోతుందని అభిప్రాయపడ్డారు.
కొంతకాలం తర్వాత నిర్మాత దొరస్వామిరాజు నుంచి పిలుపు వచ్చింది. నాగార్జున కోసం కథ చెప్పమని అడగగా, మధు వెంటనే అంగీకరించారు. విమాన ప్రయాణంలోనే దొరస్వామిరాజుకు కథా వివరించగా, ఆయనకు బాగా నచ్చింది. అప్పట్లో కథ చెప్పకముందే అడ్వాన్స్ తీసుకునే అలవాటు మధుకు ఉండగా, దొరస్వామిరాజు వెంటనే అడ్వాన్స్ ఇచ్చారు. హైదరాబాద్ చేరుకున్నాక, అన్నపూర్ణ స్టూడియోలో వెంకట్ అక్కినేని, దొరస్వామిరాజు, కోదండరామిరెడ్డిలకు కథను వివరించారు. మధు తన స్పాట్ ఇంప్రొవైజేషన్ నైపుణ్యంతో, డైలాగులతో సహా నాగార్జునకు 1 గంట 45 నిమిషాల పాటు కథను వివరించారు. నాగార్జున ఈ కథ విని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి, మధును కౌగిలించుకుని, ఈ సినిమా మాత్రమే కాదు, నా తదుపరి చిత్రాలకు కూడా మీరే రాయాలి అని కోరారు. అలాగే మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చేయమని పదేపదే చెప్పారు.
ఈ చిత్రంలో నాదముని అనే పాత్రను తాను సృష్టించినప్పుడు, ఆ పాత్రను కోట శ్రీనివాసరావు చేయాలనుకున్నట్లు మధు తెలిపారు. అయితే, నాగార్జున మాత్రం కోట కాదు.. తాను చేస్తే చాలా బాగుంటుంది అని మధును బలవంతం చేశారట. తనకున్న కమిట్మెంట్ల కారణంగా(ఏడాదికి 20 చిత్రాలు రాయాలి), మధు సున్నితంగా తిరస్కరించారు. ఈ చిత్రంలో చంద్రమోహన్ పాత్ర ప్రాధాన్యతను మధు నొక్కి చెప్పారు. ఈ సినిమా తీస్తే చంద్రమోహన్ కోసమే తీయాలి అని పట్టుబట్టి, కోదండరామిరెడ్డితో చంద్రమోహన్ను ఎంపిక చేయించారు. మా అమ్మ నాన్న పెరుమాళ్ళు, మా ముత్తాత నాగయ్య లాంటి డైలాగులు చంద్రమోహన్ చెబితేనే సహజంగా ఉంటాయని మధు వివరించారు.
దొరస్వామిరాజు తనకు మద్రాసులో పాండి బజార్లో ఫ్లాట్ కొనుక్కోవడానికి డబ్బు ఇచ్చిన కృతజ్ఞతతో మధు గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రానికి కన్నడ రీమేక్ హక్కుల విషయంలో దొరస్వామిరాజు మధుకు అదనంగా రెండు లక్షలు చెల్లించి, హక్కులు తీసుకున్నారని, అయితే 1992లో కన్నడలో రీమేక్లు చేయకూడదని ఒక రూల్ ఉండటంతో రీమేక్ ఆగిపోయిందని మధు తెలిపారు. ఆ తర్వాత సాయిప్రకాశ్ అనే దర్శకుడు అడగగా, మధు హళ్లి హీరో పేరుతో శివరాజ్ కుమార్ హీరోగా అదే కథను మార్చి కన్నడలో చేసి విజయం సాధించారు. దొరస్వామిరాజు డబ్బుకు ఆశపడకుండా, మీరు సొంతంగా చేసుకోండి అని చెప్పిన మంచితనానికి మధు ఎంతో రుణపడి ఉన్నారట. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం అద్భుతమైన టీమ్ వర్క్తో రూపొందిన గొప్ప చిత్రమని తోటపల్లి మధు ఈ సందర్భంగా ప్రశంసించారు.
ఇది చదవండి: నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్.! గుర్తుపెట్టుకోండి.. ఈసారి టీ20 వరల్డ్కప్ ఆస్ట్రేలియాదే
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
