ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన సుద్దాల అశోక్ తేజ
తెలుగు సినిమా ప్రపంచంలో గేయ రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుద్ధాల అశోక్ తేజ. దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన పాటలతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్నారు. సినీ పాటల ప్రపంచంలో తన ప్రస్థానం అద్భుతంగా, అనూహ్యంగా సాగిందని, ప్రతిరోజూ కొత్త అనుభూతినిస్తుందని అన్నారు

ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన కీలక మలుపులు, తనపై ప్రభావం చూపిన వ్యక్తులు, సాహిత్య దృక్పథం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుద్దాల అశోక్ తేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన పాటలను రచించారు. ఎంతో గొప్ప సాహిత్యంతో పాటలు రాసి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా తెలంగాణ మండలికంగా అద్భుతంగా పాటలు రచిస్తారు సుద్దాల అశోక్ తేజ. ఉదాహరణకు ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొమురం భీముడో అంటూ సాగే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు.. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. సీనియర్ హీరో, కింగ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో తన అనుబంధం గురించి వివరించారు.
మోహన్ బాబు గురించి బయట తరచుగా నెగిటివ్ ప్రచారం జరుగుతుందని, అయితే తనలాంటి సన్నిహితులు, సమకాలికులు ఆయన వ్యక్తిత్వం గురించి గొప్పగా చెబుతారని సుద్దాల అశోక్ తేజ వెల్లడించారు. తన కెరీర్ ఆరంభంలో మోహన్ బాబు బెదిరింపుతోనే తన చేత పాటలు రాయించారని ఆయన గుర్తు చేసుకున్నారు. “ఏయ్ సుద్దాలా, నువ్వు మా గురువు గారి పాటలే రాస్తే ఇంటికి వెళ్లి గుడ్డు పెట్టుకోవాల్సి ఉంటది. నా పాటలు రాయి అవి నీకు ఫుడ్డు పెడతాయి. నీకు ప్రతి నెలకు పాటలు ఉంటాయి” అని మోహన్ బాబు మొదటిసారి ఫోన్ చేసి అన్నారని అశోక్ తేజ గుర్తుచేసుకున్నారు. అప్పటికే దాసరి నారాయణ రావు గారికి పాటలు రాస్తున్న తనకు ఇది ఒక కొత్త మార్గమని అన్నారు అశోక్ తేజ.. కాగా మోహన్ బాబు ఇచ్చిన ఒక పరీక్షలో, ఒక సంగీతానికి రెండు పల్లవులు రాయమని కోరగా..
సుద్దాల అశోక్ తేజ “దొంగ జాబిలి ఇచ్చిపో పెదవితో జున్ను పలారం రంగసానిలా అందుకో” అనే పల్లవిని మాత్రమే రాసి పంపారట. ఇందులో ఉపయోగించిన “అంగ” అనే బిందు పూర్వక శబ్దం మోహన్ బాబును ఆకట్టుకుంది. ఆతర్వాత ఎన్నో అవకాశాలు ఇచ్చారని తెలిపారు. ఆ రోజు అవకాశం ఇవ్వకపోతే తాను ఇంతకాలం సినీ పరిశ్రమలో నిలబడేవాడిని కాదని, దాసరి నారాయణ రావు, మోహన్ బాబు, శ్రీహరి వంటి వారు తన 20 ఏళ్ల ప్రయాణానికి తోడ్పడ్డారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కే. రాఘవేంద్ర రావు, కృష్ణవంశీ, ఎస్.ఎస్. రాజమౌళి వంటి దర్శకులు కూడా తన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారని ఆయన ప్రస్తావించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




