AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Senior NTR: ఆ హీరో కాళ్లు మొక్కి ముద్దు పెట్టిన ఎన్టీఆర్.. అప్పట్లో ఆయన్ని తండ్రిగా భావించారు

టాలీవుడ్ ఇండస్ట్రీ తొలితరం హీరో చిత్తూరు వి. నాగయ్య మూడు దశాబ్దాల పాటు సినీ రంగంలో ఏకఛత్రాధిపత్యం వహించారు. ఆయన వినయానికి, నిరాడంబరతకు కేంద్రం పద్మశ్రీ అవార్డు కూడా ప్రకటించింది. ఈ విషయం తెలిసిన సీనియర్ ఎన్టీఆర్, నాగయ్య పాదాలకు నమస్కరించి ముద్దు పెట్టుకోవడం అరుదైన సంఘటన.

Senior NTR: ఆ హీరో కాళ్లు మొక్కి ముద్దు పెట్టిన ఎన్టీఆర్.. అప్పట్లో ఆయన్ని తండ్రిగా భావించారు
Senior Ntr
Ravi Kiran
|

Updated on: Feb 11, 2026 | 6:58 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో మూడు దశాబ్దాల పాటు తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన మహానటుడు చిత్తూరు వి. నాగయ్య. సుమారు 1500 సినిమాలలో నటించి, తెలుగు చిత్రసీమకు మార్గదర్శకుడిగా నిలిచారు. అప్పట్లో ఒక సినిమా పూర్తి చేయడానికి కనీసం రెండేళ్లు పట్టే రోజుల్లో, ఆయన ఈ స్థాయి సినిమాలు చేయడం ఆయన కృషికి, అంకితభావానికి నిదర్శనం. నాగయ్య ఎంతటి ఉన్నత స్థాయికి చేరుకున్నా, తన గొప్పదనాన్ని ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు. నాగయ్య నిరాడంబరంగా జీవించారు. వేదికలపై ఎవరైనా తనను పొగిడినప్పుడు, దానికి ప్రతిగా వందమందికి భోజనాలు ఏర్పాటు చేసి, పుణ్యంతో సరి అని చెప్పేవారు.

ఆయన నిస్వార్థ సేవను, కళారంగానికి చేసిన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఆ ఏడాది తెలుగు ఇండస్ట్రీ నుంచి నాగయ్య ఒక్కరే ఈ గౌరవాన్ని అందుకున్నారు. సాధారణంగా ఇలాంటి గౌరవం లభించినప్పుడు ఎవరైనా గొప్పగా భావించి ప్రచారం చేసుకుంటారు. కానీ నాగయ్య, కేంద్రం ఫోన్ చేసి అవార్డు ప్రకటించిన విషయం ఎవరికీ చెప్పలేదు. ఒక రోజు అకస్మాత్తుగా వాహిని స్టూడియోకు నాలుగు రోజులు సెలవు పెట్టారు. అప్పట్లో నటులందరూ స్టూడియోలకు జీతగాళ్లుగా పనిచేసేవారు. దీనిపై అక్కినేని నాగేశ్వరరావు ఆరా తీశారు. నాగయ్య షూటింగ్‌కు సెలవు పెట్టారని తెలిసి, ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అప్పుడే పద్మశ్రీ అవార్డు లభించిన విషయం బయటపడింది.

ఇది తెలిసిన ఎన్టీఆర్(అన్నగారు), ఆనందంతో తట్టుకోలేకపోయారు. “నాన్నగారు, మాకు చెబితే ఒక ఉత్సవం ఏర్పాటు చేసేవారం కదా” అని నాగయ్యతో అన్నారు. దానికి నాగయ్య చిరునవ్వు నవ్వి, “నా కన్నా మీరు బాగా నటిస్తున్నారు, మీకు కూడా వస్తే బాగుండేది” అని వినయంగా బదులిచ్చారు. నాగయ్య మాటలకు ముగ్ధుడైన ఎన్టీఆర్, షూటింగ్ స్పాట్‌లోనే ఆయన పాదాలకు నమస్కరించి, ముద్దుపెట్టుకున్నారు. ఇది ఆయన పట్ల ఎన్టీఆర్‌కు ఉన్న అపారమైన గౌరవాన్ని, ప్రేమను చెబుతోంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తన సొంత ఖర్చులతో 200 మందికి భోజనం ఏర్పాటు చేసి, నాగయ్యకు ఘనంగా సత్కరించారు. ఆ రోజుల్లో నాగయ్యను ఎన్టీఆర్ “నాన్నగారు” అని ఆప్యాయంగా పిలిచేవారు. నాగయ్య తెలుగు సినిమాకు ఒక ఫస్ట్ జనరేషన్ హీరో కాగా, ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు సెకండ్ జనరేషన్‌కు చెందినవారు. తర్వాత కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి లాంటి అనేక తరాల నటులకు నాగయ్య ఒక మార్గదర్శకుడిగా, గురుపూజ్యుడిగా నిలిచారు. నాగయ్య వంటి మహానటుడి నిరాడంబరత, ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడి గౌరవం తెలుగు చిత్రసీమ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి.