
ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్ జయప్రద.. తన నటనతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు జయప్రద. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు ఆమె.. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు జయప్రద. ముఖ్యంగా తెలుగు, తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలుచేసి మెప్పించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న జయప్రద రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో జయప్రద చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన సినీ ప్రస్థానంలోని కీలక ఘట్టాలను, సహనటులతో అనుబంధాలను, నటన పట్ల తన నిబద్ధతను పంచుకున్నారు. నాగార్జున వంటి హీరోలతో పాటు, ప్రత్యేకించి కృష్ణ గారితో తనకున్న అనుబంధాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. కృష్ణ గారు తనకు కేవలం సహనటుడు మాత్రమే కాదని, ఒక గొప్ప మనిషి, నటుడు, దర్శకుడిగా తన జీవితంలో ఎంతో మద్దతు ఇచ్చారని ఆమె ప్రశంసించారు. ఆయనతో కలిసి 45 చిత్రాలలో నటించడం తన అదృష్టమని, ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.
మహేష్తో అరుదుగా కలిసినా, ఆయన తనతో ఎంతో ఆప్యాయంగా ఉంటారని, జూనియర్ ఎన్టీఆర్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన తన పట్ల చూపిన గౌరవం మరువలేనిదని తెలిపారు జయప్రద. శోభన్ బాబు గారు తనను అత్తా అని పిలిచే ఆత్మీయత వేరని ఆమె వివరించారు. తాను నటించిన సినిమాలను చూడటానికి తాను తరచుగా భయపడతానని వెల్లడించారు. తన జుట్టు, చీర, ప్రదర్శన ఎలా ఉందో అని ఆలోచిస్తానని, అందరూ బాగుందని చెప్పిన తర్వాతే ధైర్యం చేసి చూస్తానని ఆమె నవ్వుతూ చెప్పారు. ఎన్ని సినిమాలు చేసినా, ప్రతి షాట్లోనూ ఒక కొత్త నటి పడే టెన్షన్ను తాను ఇప్పటికీ అనుభవిస్తానని తెలిపారు.
తన కెరీర్లో ఒక ముఖ్యమైన “సాక్రిఫైస్ క్యారెక్టర్” గురించి జయప్రద ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దర్శకుడు బాలచంద్ర గారు ఆమెకు తమిళ వెర్షన్ చూపించినప్పుడు, సుజాత గారు ఆ పాత్రను అద్భుతంగా చేశారని, అది చూసి తాను అంత పెద్ద పాత్రను ఎలా చేయగలనని మొదట భయపడ్డానని తెలిపారు. చిన్నపిల్లలా కనిపించే తనకు, ఆ పాత్ర కోసం పెద్ద లుక్ ఇవ్వాలని, బన్స్, రెండు పెట్టీకోట్లు, పెద్ద హీల్స్ వేయించారని గుర్తుచేసుకున్నారు. ఆ పాత్ర చూసినప్పుడల్లా ఇప్పటికీ తన కళ్ళలో నీళ్లు వస్తాయని, ముఖ్యంగా ఆత్రేయ గారు రాసిన “కళ్ళలో ఉన్నదేదో కనులకే తెలుసు” పాట ఎంతో అద్భుతమైన అర్థాన్ని కలిగి ఉందని ఆమె అన్నారు. దర్శకుడు ఆ పాత్రను పరిచయం చేసిన విధానం ఎంతో గొప్పదని ప్రశంసించారు.