స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడలో నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో పాల్గొన్నారు. పోలీస్ పరెడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ స్వాతంత్ర్య వేడుకల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ కూతురు ఆద్య కూడా ఈ ఇండిపెండెన్స్ డే వేడుకలకు హాజరైంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆద్యతో సరదాగా ఒక సెల్ఫీ తీసుకున్నారు. ఇప్పుడీ ఫొటో నెట్టింట వైరలవుతోంది. మెగా అభిమానులు, జనసేన శ్రేణులు ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. తాజాగా ఇదే ఫొటోపై రేణు దేశాయ్ స్పందించారు. కుమార్తెతో పవన్ కల్యాన్ సెల్ఫీ తీసుకుంటున్న ఫొటోలను షేర్ చేస్తూ ఒక ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. ‘నాన్నతోపాటు స్వాతంత్ర్య దినోత్సవానికి వెళ్లనా?’ అని ఆద్య నన్ను అడిగింది. తండ్రితో తగినంత సమయం గడపాలనుకోవడం, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల జీవితం ఎలా ఉంటుందో తను చూడాలనుకోవడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వాళ్ల నాన్న చేసే సేవలను ఆద్య అర్థం చేసుకుంది. ఆయన్ను ప్రశంసించింది’ అని రేణూ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.
ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు లైక్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు రేణు దేశాయ్. ఇందులో ఆమె పాత్రకు ప్రశంసలు కూడా వచ్చాయి. దీంతో ఈ నటి మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. అయితే సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు రేణు దేశాయ్. ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టులు షేర్ చేస్తోంది. అలాగే తన పిల్లలు అకీరా నందన్, ఆద్యల ఫొటోలు, వీడియోలను కూడా అందులో షేర్ చేస్తుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.