Radisson Blu Drugs Case: డ్రగ్స్‌ కేసులో మలుపులు.. శుక్రవారం విచారణకు హాజరుకానున్న దర్శకుడు క్రిష్‌

|

Feb 29, 2024 | 8:38 AM

హైదరాబాద్‌లో గచ్చిబౌలి రాడిసన్‌ బ్లూ డ్రగ్స్‌ పార్టీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. డ్రగ్స్ కేస్‌లో ఏ10 గా ఉన్న డైరెక్టర్‌ క్రిష్ ఇంకా పరారీలోనే ఉన్నట్టు గచ్చిబౌలి పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే క్రిష్ కు 160 కింద గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసులో వ్యాపార, సినీ ప్రముఖుల ప్రమేయం ఉండటంతో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రాడిసన్‌ హోటల్‌లో పార్టీ..

Radisson Blu Drugs Case: డ్రగ్స్‌ కేసులో మలుపులు.. శుక్రవారం విచారణకు హాజరుకానున్న దర్శకుడు క్రిష్‌
Radisson Blu Drugs Case
Follow us on

హైదరాబాద్‌, ఫిబ్రవరి 29: హైదరాబాద్‌లో గచ్చిబౌలి రాడిసన్‌ బ్లూ డ్రగ్స్‌ పార్టీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. డ్రగ్స్ కేస్‌లో ఏ10 గా ఉన్న డైరెక్టర్‌ క్రిష్ ఇంకా పరారీలోనే ఉన్నట్టు గచ్చిబౌలి పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే క్రిష్ కు 160 కింద గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసులో వ్యాపార, సినీ ప్రముఖుల ప్రమేయం ఉండటంతో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రాడిసన్‌ హోటల్‌లో పార్టీ నిర్వహించిన డ్రగ్స్‌ పార్టీలో పాల్గొన్న పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో నలుగురిని అరెస్ట్‌ చేశారు. మిగిలిన వారి కోసం పోలీసు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మరికొంత మంది పేర్లు బయటికి వస్తున్నాయి. అరెస్టయిన నిందితుల ఫోన్‌ డేటా, లావాదేవీల ఆధారంగా పోలీసులు కొంతమంది వివరాలు సేకరించినట్లు తెలిసింది. విచారణలో రాడిసన్‌ బ్లూ హోటల్‌లో జరుగుతోన్న ఇల్లీగల్‌ దందా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అక్కడ గత కొన్ని రోజులుగా ప్రతి వారాంతంలో పార్టీలు జరిగేవని విచారణలో తెలిసింది. మరోవైపు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు బస చేసే రాడిసన్‌ హోటల్‌లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన గజ్జల వివేకానంద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేసిన సయ్యద్‌ అబ్బాస్‌ అలీ జాఫ్రీని గచ్చిబౌలి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వివేకానంద్‌ డ్రైవర్‌ ప్రవీణ్‌ను కూడా బుధవారం (ఫిబ్రవరి 29) అదుపులోకి తీసుకున్నారు. అబ్బాస్‌ పలుచోట్ల కొకైన్‌ తెచ్చి డ్రైవర్‌ ప్రవీణ్‌కు ఇచ్చి.. అతని ద్వారా వివేకానంద్‌కు చేరవేసేవాడు. ఈక్రమంలో ప్రవీణ్‌, అబ్బాస్‌ల మధ్య జరిగిన నగదు లావాదేవీలను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పరారీలో ఉన్న రఘుచరణ్‌, సందీప్‌, నీల్‌, శ్వేత, యూట్యూబర్‌ లిషి, టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు క్రిష్‌ తదితరుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఇక ఈ డ్రగ్స్‌ పార్టీకి సినీ దర్శకుడు క్రిష్‌ కూడా హాజరైనట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు ఆయనను విచారణకు పిలవగా.. శుక్రవారం వస్తానని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఆయన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తుందని పోలీసులు చెబుతున్నారు. క్రిష్‌ ముంబాయికి వెళ్లినట్లు సమాచారం.

కాగా ఫిబ్రవరి 25న గచ్చిబౌలి రాడిసన్‌ బ్లూ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ జరుగుతున్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అదే రోజు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో రాడిసన్‌ హోటల్‌లోని 1200, 1204 గదుల్లో నుంచి డ్రగ్స్‌ వాడేందుకు ఉపయోగించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంజీరా గ్రూప్‌ డైరెక్టర్‌, బీజీపీ నాయకుడు యోగానంద్‌ కుమారుడు గజ్జెల వివేకానంద్‌ ఈ పార్టీని నిర్వహించినట్లు పోలీసులు గుర్తించి, అతడిని అరెస్టు చేశారు. మొత్తం 10 మంది కలిసి పార్టీ చేసుకున్నారు. అదే రోజు టాలీవుడ్‌ నిర్మాత కేదారినాథ్‌, వ్యాపారవేత్త నిర్భయ్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని, వీరి ముగ్గురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో ముగ్గురు కొకైన్‌ తీసుకున్నట్లు తేలడంతో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వివేకానంద్‌ వారాంతాల్లో హోటల్‌కు వచ్చి, తన స్నేహితులతో కలిసి పార్టీలు నిర్వహించేవాడని విచారణలో వెల్లడైంది. ఈ పార్టీలకు పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు హాజరవుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరోవైపు రాడిసన్‌ హోటల్‌లో మొత్తం 200 కెమెరాలుండగా, వాటిల్లో 20 మాత్రమే పనిచేయడం కేసులో సవాలుగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.