
నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలకు ఉండే క్రేజే వేరు.. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. ఇటీవల కాలంలో ఆయన వరుసగా హిట్స్ మీద హిట్స్ కొడుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వీరసింహారెడ్డి సినిమా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా రానుండటంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి., త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ ఎక్కువగా పూజలు చేస్తారన్న విషయం తెలిసిందే..
బాలయ్యకు దైవ భక్తి ఎక్కువ.. ప్రతిరోజు పూజ చేస్తారు. అలాగే ముహూర్తాలను, జాతకాలను ఎక్కువగా నమ్ముతుంటారు బాలకృష్ణ. అయితే బాలయ్యకు ఓ డేంజర్ ఉందట.. ఆ విషయాన్నీ ఆయనే స్వయంగా తెలిపారు. డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ.. తనకు బ్లాక్ కలర్ కలిసిరాదు అని తెలిపారు. బాలయ్య మాట్లాడుతూ.. తన నలుపు దుస్తుల సెంటిమెంట్ను వివరించారు.
తన మూల నక్షత్రం, నైరుతి ప్రభావం వల్ల ఆదివారాల్లో నలుపు దుస్తులు ధరించడం తనకు ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ నమ్మకానికి నిదర్శనంగా ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఆదిత్య 369 సినిమా షూటింగ్ సమయంలో ఓ ప్రమాదం జరిగిందని తెలిపారు బాలకృష్ణ. ఒక ఆదివారం నాడు నలుపు షర్ట్ ధరించి ఇంటి నుంచి షూటింగ్ లొకేషన్కు వెళ్లారు. అక్కడ నిర్మాతలలో ఒకరైన బాల సుబ్రహ్మణ్యం గారు అదే సమయంలో అక్కడికి వచ్చారు. ఆయన షూటింగ్ కు ఎప్పుడూ రారు. రాకరాక అదే రోజు వచ్చారు. ఆయన చూస్తుండగానే నేను పై నుంచి కింద పడ్డాను.. ప్రమాదవశాత్తు జారిపడి నా నడుముకు తీవ్ర గాయం అయ్యిందని, ఎల్ 5 హెయిర్లైన్ ఫ్రాక్చర్ అయ్యిందని తెలిపారు. ఈ సంఘటనతో బాల సుబ్రహ్మణ్యం భయపడి, సినిమా పూర్తయ్యే వరకు మళ్లీ లొకేషన్కు రాలేదని బాలకృష్ణ వెల్లడించారు.