
టాలీవుడ్ సీనియర్ నటి మళ్లీ పబ్ పార్టీలో కనిపించింది. కొండాపూర్లోని ‘క్వాక్ ఏరీనా పబ్’ లో జరిగిన ఓ పార్టీలో ఆమె పాల్గొంది. అయితే ఈ పబ్ లో డ్రగ్స్ సరఫరా అవుతుందన్న సమాచారంతో ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా ‘క్వాక్ ఏరీనా పబ్’ మెరుపు దాడులు నిర్వహించారు. పబ్లో పార్టీ జరుగుతున్న సమయంలో సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు, అక్కడ ఉన్న సుమారు 64 మందికి డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొత్తం 8 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో ఆరుగురు గంజాయి సేవించినట్లుగా, మరో ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదే సమయంలో హేమకు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయగా.. నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమెనే ఒక వీడియో ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘మళ్లీ పబ్ కి వచ్చాను.. ఇప్పుడే ఈగల్ టీం వాళ్లు చేసిన డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది’ తన యూరిన్ టెస్ట్ రిపోర్ట్ చూపించింది హేమ. ‘మీ హేమక్క ఎప్పుడూ తప్పు చేయదని.. రేపు మళ్లీ టెస్ట్ డ్రగ్స్ టెస్ట్ కి సంబంధించిన మరో వీడియో పోస్ట్ చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది హేమ.
కాగా పబ్ ప్రాంగణం నుంచే నటి హేమ ఈ వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కాగా కొన్ని నెలల క్రితం బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పేరు వినిపించడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఆమె కొన్ని రోజుల పాటు జైలులో కూడా ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే ఈ డ్రగ్స్ కేసులో నటి హేమకు క్లీన్ చీట్ ఇచ్చింది బెంగళూరు కోర్టు. అయితే డ్రగ్స్ వార్తల ప్రభావం తన వ్యక్తిగత జీవితంపై మాత్రమే కాకుండా కుటుంబంపై కూడా తీవ్రంగా పడిందని హేమ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వార్తలను విన్న తన తల్లి బాగా కుంగిపోయి కన్నుమూసిందని నటి వాపోయింది.
ఇదిలా ఉంటే నటి హేమ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటోంది. డ్రగ్స్ కేసులో ఆమె పేరు వినిపించినప్పటి నుంచే ఆమె సినిమాలు మానేసింది. అయితే ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో తనకు ఛాన్స్ వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.