Dil Raju: సౌందర్య సినిమాతోనే డబ్బంతా పోయింది.. కానీ ఆ మూవీ వల్లే తలరాత మారింది
దిల్ రాజు నిర్మాతగా సక్సెస్ఫుల్ అయిన సంగతి తెలిసిందే. అయితే డిస్ట్రిబ్యూటర్గా కొన్ని వైఫల్యాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. పెళ్లి పందిరి సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకుని, ఎం.ఎస్.రెడ్డి సాయంతో విజయం సాధించారు. ఈ సినిమానే ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. ఆ వివరాలు..

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా మారిన తన ప్రయాణాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, కేవలం వ్యాపార దృష్టితో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన, పట్టుదల, నిజాయితీ, అపారమైన సినిమా అవగాహనతో అంచెలంచెలుగా ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. సినీ ఇండస్ట్రీలోకి డిస్ట్రిబ్యూటర్గా కొనసాగుతున్నప్పుడే సినిమా విజయావకాశాలను అంచనా వేసే సామర్ధ్యం తనకు వచ్చిందని దిల్ రాజు తెలిపారు. 26-27 ఏళ్ల వయసులోనే, ఉదయం షో చూసి ఏ సినిమా ఆడుతుందో, ఏది ఆడదో చెప్పగలిగే నైపుణ్యం తనకు అలవడిందని ఆయన గుర్తుచేసుకున్నారు. కేవలం ఇతరులు తీసిన సినిమాలను పంపిణీ చేయడమే కాకుండా, తన సొంతంగా సినిమాలు నిర్మించి విడుదల చేయాలనే ఆలోచన అప్పుడే పుట్టిందని, నాగార్జున, అల్లు అరవింద్, అశ్వనీదత్ లాంటి స్టార్ నిర్మాతల పనితీరును పరిశీలించడం ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
నిర్మాతగా మారడానికి ముందు, దిల్ రాజుకు అనేక వైఫల్యాలు ఎదురయ్యాయి. 1996లో హర్షిత ఫిలిమ్స్ బ్యానర్పై మూడు సినిమాలను పంపిణీ చేసి భారీ నష్టాలను చవిచూశారు. దాదాపు 80 లక్షల రూపాయలు కోల్పోయి, అప్పుల్లో కూరుకుపోయారు. ఆ సమయంలో ఆటోమొబైల్ వ్యాపారానికి తిరిగి వెళ్లి అప్పులు తీర్చుకోవాలని కూడా ఆలోచించారు. ఈ కష్టకాలంలోనే, కాస్ట్యూమ్ కృష్ణ నిర్మించిన అరుంధతి సినిమాకు 36 లక్షల కమిట్మెంట్ ఇచ్చారు. సినిమా విడుదల రోజున 34 లక్షలు మాత్రమే చెల్లించగలిగారు. సినిమా డిజాస్టర్ అయినా, మిగిలిన 2 లక్షలను వెళ్లి కాస్ట్యూమ్ కృష్ణకి చెల్లించి తన కమిట్మెంట్ను నిలబెట్టుకున్నారు. ఈ నిజాయితీ, కమిట్మెంట్కు కట్టుబడి ఉండడమే ఆయన కెరీర్ను ఒక మలుపు తిప్పింది. కాస్ట్యూమ్ కృష్ణ, కన్నడ రీమేక్ అనురాగ సంగమం ఆధారంగా జగపతిబాబుతో పెళ్లి పందిరి సినిమాను ప్రారంభించనున్నారని దిల్ రాజుకు తెలిపారు. మొదట తన అన్నయ్య సినిమా రంగంలోకి తిరిగి రావడానికి ఒప్పుకోనప్పటికీ, పెళ్లి పందిరి సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకంతో శిరీష్, లక్ష్మణ్లతో పాటు తన చిన్న అన్నయ్యను ఒప్పించారు. సినిమా బాగా నచ్చినప్పటికీ, దాన్ని కొనుగోలు చేయడానికి డబ్బు లేకపోవడంతో ఆరు లక్షల అడ్వాన్స్ కోసం ఎంతో కష్టపడ్డారు.
చివరికి, దుకాణంలో ఉన్న డబ్బు, స్నేహితుల సాయంతో 3 లక్షలు సమకూర్చి, మిగిలిన 3 లక్షలను వారం రోజుల్లో ఏర్పాటు చేసి మొదటి వాయిదాను చెల్లించారు. ఆర్థికంగా మరింత సహాయం కోసం చాలా మందిని సంప్రదించినా నిరాశే ఎదురైంది. అప్పుడే ఎం.ఎస్.రెడ్డి నుంచి పార్టనర్షిప్ కోసం పిలుపు వచ్చింది. ఎం.ఎస్.రెడ్డి లాంటి దిగ్గజ నిర్మాత తనతో భాగస్వామ్యం కోరడం దిల్ రాజుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎం.ఎస్.రెడ్డి సహకారంతో పెళ్లి పందిరి సినిమాకు మిగిలిన పెట్టుబడి సమకూరింది. విడుదల రోజున కొన్ని సమస్యలు ఎదురైనా, ఎం.ఎస్.రెడ్డి పలుకుబడితో నైజాం ప్రాంతంలో సినిమా విడుదలైంది. ఊహించని విధంగా పెళ్లి పందిరి చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇది దిల్ రాజు జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్గా నిలిచింది. తన నిజాయితీ, కమిట్మెంట్ వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన నమ్మారు. దిల్ సినిమాతో నిర్మాతగా మారిన దిల్ రాజు.. 24 క్రాఫ్ట్స్లోనూ భాగమై.. ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, మున్నా, కొత్త బంగారు లోకం లాంటి అనేక విజయవంతమైన చిత్రాలతో కొత్త దర్శకులను పరిచయం చేశారు.
